
దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలోని మానవ మృగాలు కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ 15 ఏళ్ల బాలికపై ఆమె ట్యూషన్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. యూపీలోని సహరాన్పూర్లో ఉంటున్న బాధిత బాలిక గురువారం ట్యూషన్కు వెళ్లింది. అయితే ట్యూషన్ టీచర్ బాలికను అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోని రూర్కీకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు.
అనంతరం ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను ట్యూషన్ టీచర్ బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. అయితే ఇంటికి తిరిగివచ్చిన తర్వాత బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు నిందితుడైన ట్యూషన్ టీచర్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. ట్యూషన్ టీచర్ పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.