పహల్గాం దాడి తర్వాత 15 లక్షల సైబర్ దాడులు

Published : May 13, 2025, 10:44 AM IST
పహల్గాం దాడి తర్వాత 15 లక్షల సైబర్ దాడులు

సారాంశం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత వెబ్‌సైట్‌లపై 15 లక్షల సైబర్ దాడులకు పాకిస్తాన్‌కు చెందిన ఏడు APT గ్రూపులే కారణమని మహారాష్ట్ర సైబర్ గుర్తించింది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులపై మహారాష్ట్ర సైబర్ విభాగం కీలక నివేదికను విడుదల చేసింది. దేశంలోని కీలక ప్రభుత్వ వెబ్‌సైట్లు, మౌలిక సదుపాయాలపై గత కొద్ది నెలలుగా భారీ స్థాయిలో హ్యాకింగ్ యత్నాలు జరుగుతున్నాయని ఇందులో వివరించారు. మొత్తం దాదాపు 15 లక్షల సైబర్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. వీటిలో 150 దాడులు మాత్రమే పూర్తిగా విజయవంతమయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఈ దాడులకు సంబంధించి ఏడు కీలక విదేశీ హ్యాకర్ గ్రూపులను గుర్తించినట్టు మహారాష్ట్ర సైబర్ అదనపు డీజీపీ యశస్వి యాదవ్ తెలిపారు. ఇందులో పాకిస్తాన్‌కు చెందిన APT 36, పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేన్ PK, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హాక్స్ సెక్యూరిటీ, HOAX 1337 అనే గ్రూప్, పాకిస్తాన్‌కు అనుబంధంగా ఉన్న నేషనల్ సైబర్ క్రూ ఉన్నాయి. వీరంతా కలిసి భారత్‌లోని ప్రభుత్వ శాఖలు, విమానాశ్రయాలు, టెలికాం వ్యవస్థలు వంటి కీలక వ్యవస్థలపై దాడులు జరిపారు.

సైబర్ దాడుల్లో వారు ఉపయోగించిన పద్ధతుల్లో మాల్వేర్ పంపిణీ, వెబ్‌సైట్ డీఫేస్‌మెంట్, DDoS దాడులు, GPS స్పూఫింగ్ వంటి అధునాతన మార్గాలు ఉన్నాయి. కుల్గామ్ బద్లాపూర్ మున్సిపల్ వెబ్‌సైట్, జలంధర్ డిఫెన్స్ నర్సింగ్ కాలేజ్ వెబ్‌సైట్‌లు ప్రభావితమయ్యాయి. అంతేకాక, ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డేటా దొంగతనం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌కు అనుబంధంగా ఉన్న హ్యాకర్ గ్రూపులు భారత్‌పై ఓ రకమైన హైబ్రిడ్ యుద్ధం ప్రారంభించాయని నివేదిక చెబుతోంది. ఇందులో అసత్య ప్రచారాలు, నకిలీ వార్తలు కీలక పాత్ర పోషించాయి. బ్యాంకింగ్ వ్యవస్థ హ్యాక్ చేయడం, విద్యుత్ గ్రీడ్‌పై దాడులు, శాటిలైట్‌లను జామ్ చేయడం వంటి అసత్య సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 5,000కు పైగా ఫేక్ పోస్టులు తొలగించినట్టు అధికారులు తెలిపారు.

ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ధృవీకరించని సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ఎలాంటి వార్తలైనా షేర్ చేయకూడదని మహారాష్ట్ర సైబర్ విభాగం విజ్ఞప్తి చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu
PM Narendra Modi Speech in Dum Dum: వెస్ట్ బెంగాల్ సభలో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu