బయటి శక్తుల పనే: ఢిల్లీ అల్లర్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్

By telugu teamFirst Published Feb 26, 2020, 6:41 PM IST
Highlights

ఢిల్లీ అల్లర్లు రాజకీయ శక్తులు, బయటి శక్తుల పనే అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలర్లలో హిందువులూ ముస్లింలూ మరణించారని ఆయన చెప్పారు. శవాల గుట్టల మీద ఢిల్లీ నిర్మాణం కాదని చెప్పారు.

న్యూఢిల్లీ: శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య ఢిల్లీలోని అల్లర్ల వల్ల ముస్లింలు గానీ హిందువులు గానీ లాభపడబోరని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఆయన బుధవారం ఢిల్లీ అల్లర్లపై మాట్లాడారు. 

ఘర్షణలకు రాజకీయ శక్తులు, బయటి నుంచి వచ్చిన శక్తులు కారణమని ఆయన విమర్శించారు. అల్లర్ల వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోయారని ఆయన అన్నారు. 20 మందికి పైగా మరణించారని, మృతుల్లో హిందువులూ ముస్లింలూ ఉన్నారని ఆయన చెప్పారు. పోలీసు కూడా మరణించాడని ఆయన చెప్పారు. గాయపడినవారి జాబితా కూడా తన వద్ద ఉందని చెప్పారు. 

Also Read: బిజెపి నేతల హేట్ స్పీచ్ ల వీడియోలు చూసి హైకోర్టు సంచలన ఆదేశాలు

ప్రజలకు రెండే మార్గాలున్నాయని, ఒకటి... ప్రజలంతా ఏకమై పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, రెండోది పరస్పరం కొట్టుకుని చంపుకోవడమని ఆయన అననారు. ఆధునిక ఢిల్లీ శవాల గుట్టల మీద నిర్మితం కాదని చెప్పారు. విద్వేషపూరిత రాజకీయాలను, అల్లర్లను, ఇళ్లను తగులబెట్టడం వంటి చర్యలను సహించబోమని అన్నారు. 

పరిస్థితిని అదుపులోకి తేవడానికి సైన్యాన్ని పిలిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని కూడా ఆయన సూచించారు. ఢిల్లీ అల్లర్లలో ఇప్పటి వరకు 23 మంది మరణించారు. 200 మంది దాకా గాయపడ్డారు. 

Also Read: రెచ్చగొట్టే ప్రసంగాలు: హైకోర్టులో మరో ఇద్దరు బిజెపి నేతల వీడియోలు

అల్లర్లలో మరణించిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబ యోగక్షేమాలు తాము చూసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

click me!