Pakistan Earthquake : మొన్న మయన్మాన్ మరియు థాయిలాండ్, నిన్న అప్ఘానిస్తాన్, నేడు పాకిస్థాన్... పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. భారత భూభాగం చుట్టూ చోటుచేసుకుంటున్న ఈ భూకంపాలతో దేశ ప్రజల భయాందోళనకు గురవుతున్నారు.
ఇవాళ (శనివారం) పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. చాలాప్రాంతాల్లో భూమి కంపించడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. దీని తీవ్రత తక్కువగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది.
ఒక్కసారిగా భూమి కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు కేకలు వేస్తూ బహిరంగ ప్రదేశాలకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్లో సంభవించిన ఈ భూకంపం యొక్క ప్రకంపనలు కాశ్మీర్ లోయలో కూడా సంభవించాయి.
భూకంప కేంద్రం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఈ ఈ ప్రభావంతో ప్రకంపనలు భారతదేశంలోని కాశ్మీర్లో కూడా సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండగా, ఒక్కసారిగా వారి కాళ్ల కింద ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్లో ఇది రెండో భూకంపం.
ఎన్సిఎస్ ప్రకారం మొదటి భూకంపం ఉదయం 11:55 గంటలకు మండి బహావుద్దీన్ సమీపంలో సంభవించింది. ఈ భూ ప్రకంపనలు కొండ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం కలిగించవచ్చు, దీనివల్ల అక్కడి ప్రజలు మరింత భయభ్రాంతులకు గురయ్యారు.