
ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సద్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. గతంలో ట్రంప్పై చేసిన తీవ్రమైన ఆరోపణలపై ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పడంతో, ఇద్దరి మధ్య మళ్లీ స్నేహబంధం చిగురించినట్లు తెలుస్తోంది.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. “అమెరికా అధ్యక్షుడిపై నా పోస్టులు హద్దులు దాటి వెళ్లినట్లు అనిపిస్తోంది. వాటిపై విచారం కలుగుతోంది” అంటూ ఆయన బహిరంగంగా క్షమాపణ తెలిపారు.
ఈ ప్రకటనకి ముందు సోమవారం అర్ధరాత్రి మస్క్ ట్రంప్కు ప్రైవేటుగా ఫోన్ చేసినట్లు అమెరికా మీడియా నివేదించింది. ఆ కాల్లోనే మస్క్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి, క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందిస్తూ – “ఎలాన్ మస్క్ క్షమాపణను ట్రంప్ అంగీకరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వ కాంట్రాక్టులపై మస్క్కు రివ్యూలు ఉంటాయా? అనే ప్రశ్నకు ఆమె 'అలాంటి పరిశీలన లేదు' అని స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు బాగా ముదిరిన విషయం తెలిసిందే. “బిగ్ బ్యూటిఫుల్ బిల్లు” అనే ప్రభుత్వ పథకాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించగా, ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, మస్క్... ట్రంప్ను జెఫ్రీ ఎప్స్టైన్ లాంటి వివాదాస్పద వ్యక్తులతో లింక్ చేశాడు.
అంతేగాక, తన మద్దతు లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో గెలవలేరని వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ, “ఎలాన్ మస్క్ అవసరం లేకుండానే నేనే గెలిచాను. ఇక ముందు ఆయన వ్యాపారాలకు ఇచ్చే ప్రభుత్వ సహాయాలపై పునఃపరిశీలన చేస్తాం” అని హెచ్చరించారు.
అయితే మస్క్ క్షమాపణతో వైరానికి ముగింపు పడినట్లు అంతా భావిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ విల్స్ ఫోన్లో మస్క్ను సంప్రదించి, ట్రంప్తో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.