నన్ను ఎందుకు పుట్టనిచ్చావ్? తల్లికి వైద్యం చేసిన డాక్టర్‌పై బిడ్డ ఫిర్యాదు.. కోర్టులో కేసు విజయం

By telugu teamFirst Published Dec 2, 2021, 8:04 PM IST
Highlights

యునైటెడ్ కింగ్‌డంలో విచిత్ర కేసుపై అంతకంటే విచిత్రమైన వాదనలు జరిగాయి. తన తల్లికి డాక్టర్ సరైన సూచనలు చేయనందు వల్ల ఆమె సరిపడా ఫోలిక్ యాసిడ్ తీసుకోలేదని, తద్వార తాను స్పైనా బైఫైడా అనే ఆరోగ్య సమస్యతో జన్మించానని ఆ తల్లి బిడ్డ కోర్టుకెక్కింది. తన తల్లికి ఈ విషయంపై సూచనలు చేస్తే గర్భం దాల్చడాన్ని వాయిదే వేసుకునే వారని వాదించింది. తాను ఈ అనారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి డాక్టరే బాధ్యులని వాదించి లండన్ హైకోర్టులో గెలిచారు. అంతేకాదు, నష్టపరిహారాన్ని ఆమె పొందుతున్నారు.
 

న్యూఢిల్లీ: UKలో ఓ విచిత్ర ఘటన ముందుకు వచ్చింది. తనను ఎందుకు పుట్టనిచ్చారని తన తల్లికి వైద్యం అందించిన డాక్టర్‌పై బిడ్డ ఫిర్యాదు చేసింది. ఆ డాక్టర్‌ను కోర్టుకు లాగింది. ఔను.. డాక్టర్‌దే తప్పు అని కోర్టు కూడా అంగీకరించింది. సదరు యువతి తల్లికి సరైనా సూచనలు చేయని కారణంగా వైద్యురాలిని తప్పుపట్టింది. లక్షల పౌండ్లను ఆమె నష్టపరిహారం(Compensation) రూపంలో పొందనున్నారు. London హైకోర్టులో ఈ విచిత్ర కేసు విచారణ జరిగింది. యూకేకు చెందిన 20 ఏళ్ల ఈవీ టూంబ్స్.. డాక్టర్ ఫిలిప్ మిచెల్‌ను లండన్ హైకోర్టు మెట్లు ఎక్కించారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈవీ టూంబ్స్ తల్లికి డాక్టర్ ఫిలిప్ మిచెల్ వైద్యం అందించేవారు. ఈవీ టూంబ్స్ తల్లి గర్భం దాల్చినప్పుడు ఆమెకు డాక్టర్ పిలిప్ మిచెల్ సరైన సూచనలు చేయలేదు. వైద్య సలహాలు ఇవ్వలేదు. ముఖ్యంగా ఆమె ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవాలనే సూచనలు చేయలేదు. గతంలో ఆమె శ్రేష్టమైన ఆహారం తిని ఉంటే ప్రత్యేకంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ వైద్యురాలు చెప్పినట్టు ఈవీ టూంబ్స్ తల్లి కోర్టులో వివరించారు. ఆ సూచనల మేరకు ఈవీ టూంబ్స్ తల్లి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోలేదు. తత్ఫలితంగా ఈవీ టూంబ్స్ స్పైనా బైఫైడా అనే ఓ వెన్ను సమస్యతో జన్మించారు. ఆమె సరిగ్గా ఫోలిక్ యాసిడ్ తీసుకుని ఉంటే ఈ సమస్య చాలా వరకు తగ్గించే ఉండేది.

Also Read: Antique Coins: భారీగా బ‌య‌ట‌బ‌డ్డ పురాత‌న నాణేలు.. ఎక్క‌డంటే?

పుట్టబోయే బిడ్డకు స్పైనా బైఫైడా సమస్య దరి చేరకుండా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలని ఒక వేళ డాక్టర్ ఫిలిప్ మిచెల్ గనక తన తల్లికి చెప్పి ఉంటే తనకు ఈ సమస్య ఉండేది కాదని ఈవీ టూంబ్స్ కోర్టులో వాదించారు. సరైనా సూచనలు, సలహాలు అందిస్తే ఆమె గర్భం దాల్చడాన్ని కొంత కాలం వాయిదా వేసుకుని ఉండేదని వాదనలు చేశారు. ఇక్కడ మరో అంశం గుర్తు పెట్టుకోవాలి. ఒక వేళ డాక్టర్ సరిగ్గా సూచనలు చేసి ఉంటే ఆ తల్లి గర్భాన్ని నిజంగానే వాయిదా వేసుకుని ఉంటే ఈవీ టూంబ్స్ జన్మించే వారే కాదు.

ఈ కేసుపై జడ్జీ రోసాలిండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీ టూంబ్స్ తల్లికి సరైన సూచనలు చేసి ఉంటే ఆమె తన గర్భాన్ని వాయిదా వేసుకునే వారని అన్నారు. అలా చెప్పి ఉంటే ఆమె మరికొంత కాలం తర్వాత గర్భం దాల్చి ఉండేవారేమోనని, అలా జరిగితే ఆ గర్భం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువు జన్మించి ఉండేదేమోనని పేర్కొన్నారు. ఈ కేసులో ఈవీ టూంబ్స్ గెలిచారు. అంతేకాదు, ఆమె నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈవీ టూంబ్స్ లాయర్ పరిహారంపై మాట్లాడుతూ, ఈవీ టూంబ్స్ ఖర్చులను లెక్కవేయలేదని, జీవితాంతం ఆమె చికిత్సకు సంబంధించిన అవసరాలను గణించాల్సి ఉన్నదని వివరించారు.

ఈ తీర్పు సంచలనంగా మారింది. ఎందుకంటే వైద్య నిపుణులు గర్భిణులకు సరైన సూచనలు చేయాలన్నే సంకేతాలు ఈ తీర్పులో వచ్చాయి. ఒకవేళ వారి నిర్లక్ష్యం వహించి బిడ్డ అనారోగ్య సమస్యలతో జన్మిస్తే అందుకు వైద్యులను బాధ్యులుగా ప్రకటించేలా తీర్పు ఉన్నది.

click me!