వివరాల్లోకి వెళితే.. మీరచౌక్ ప్రాంతంలో గల గుల్జార్ హౌస్ సమీపంలోని భవనంలో ఉన్న వస్త్ర దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఇప్పటివరకు 14 మందిని రక్షించి చికిత్స కోసం ఉస్మానియా, యశోద (మలక్పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
సుమారు 30 మందికిపైగా భవనంలో చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రేన్లు, ల్యాడర్లు, హైడ్రాలిక్ పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక దళం, పోలీసులు, మెడికల్ టీమ్లు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య భవనం కావడంతో అక్కడ భారీగా స్టాక్ చేసిన వస్తువులు మంటల్లో పూర్తిగా నాశనం అయ్యే అవకాశముంది.
దీంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులన్నీ పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఘటనతో నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే సమయంలో మిస్ వరల్డ్ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండటంతో, ట్యాంక్బండ్ పరిసరాల్లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.