ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డికి ప్రత్యేక ఖైదీ హోదా (special category prisoner) ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను హైదరాబాద్లోని ప్రత్యేక సీబీఐ కోర్టు తిరస్కరించింది.
చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న గాలి, ప్రత్యేక ఖైదీగా గుర్తించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోర్టును కోరారు. అయితే, గురువారం కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ, "ఈ కేసులో తీర్పు ఇప్పటికే వెలువడింది. ప్రస్తుతం ఎలాంటి పెండింగ్ అంశాలు లేవు. అందువల్ల ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యపడదు" అని స్పష్టం చేసింది.
గత 14 ఏళ్లుగా నడిచిన ఓబులాపురం మైనింగ్ కేసులో అక్రమంగా ఐరన్ ఓర్ ఎగుమతులు జరిగాయని కేసు నమోదైంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్డపడ్డారన్న అంశాలపై 7 ఏళ్లు కేసు నడించింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మిగిలిన ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం వాటిల్లినట్లు విచారణ తేలింది.
సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు గాలి జనర్ధాన్ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. త్వరలో జామీన్ పిటిషన్ తో పాటు, ప్రత్యేక ఖైదీ హోదా కోరుతూ మరోసారి దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.