గుడివాడలో మంచి వాన

First Published Aug 22, 2017, 8:21 AM IST
Highlights
  • గుడివాడలో భారీ వాన  
  • తమిళనాడు లో మళ్లీ రెండుగా చీలిన అన్నాడీఎంకే  పార్టీ
  • 2017 సంవత్సరానికి క్రీడా అవార్డులను ప్ర‌క‌టించిన కేంద్ర ప్రభుత్వం
  • మెగాస్టార్ 151 సినిమాకు సైరా నరసింహారెడ్డి టైటిల్ ఖరారు
  • ట్రిపుల్ తలాక్   అభ్యంతరాలపై పార్లమెంట్ లో చట్టం చేయాలని  సూచించిన సుప్రీం కోర్డు

ఇంటర్ బోర్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమ బోర్డుగా మారుస్తామని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డుతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని విద్యాభివృద్దికి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా  వృత్తివిద్య పటిష్టం చేయాలని, అందులో కొత్త కోర్సులు పెట్టేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని వారికి సూచించారు.   రూ.325 కోట్లతో 404 కాలేజీల్లో వసతుల కల్పన, భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుబంధ గుర్తింపు లేని ప్రైవేట్ కాలేజీల జాబితా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ సంస్కరణలతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందన్నారు.
 

గుడివాడలో మంచి వాన

ఇవాళ గుడివాడలో భారీ వాన కురిసింది.
 

కాకినాడ వైసీపి లోకి వలసలు
 

కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ప్రతిపక్ష వైసీపి లోకి భారీ వలసలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి దాదాపు 500 మంది కార్యకర్తలు వైసీపి లోకి చేరారు. 47 వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపి నగర సమన్వయకర్త ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు ద్వారపూడి వీరభద్ర రెడ్డి ఆద్వర్యంలో వీరంతా పార్టీలోకి చేరారు. ఇప్పటికే ఊపుమీదున్న పార్టీ ఈ వలసలతో మరింత బలపడిందని వీరభద్ర రెడ్డి తెలిపారు.  
 

హైదరాబాద్ పోలీసు అకాడమీ పేరు మార్పు

తెలంగాణ పోలీస్ అకాడమీ పేరు ను  రాజా బహదూర్ వెంకట రామి రెడ్డి పోలీస్ అకాడమీ గా మార్పు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ రోజు రెడ్డి హస్టల్ శతవార్షిక సభలో ప్రసంగిస్తూ  ఈ హాస్టల్ స్థాపించిన రాజబహద్దూర్ వెంకట్రామారెడ్డి సంఘసేవను  కొనియాడారు.  నిజాం కొత్వాల్ పనిచేసిన  రాజబహద్దూర్ సేవలకు గుర్తింపుగా పోలీసు అకాడమీకి ఆయన పేరు పెడుతున్నట్లు  ముఖ్యమంత్రి ప్రకటించారు.
 

మార్కెటింగ్ శాఖపై హరిష్ రావు సమీక్ష

హైదరాబాద్ నగర పరిసరాల్లో నిర్మిస్తున్న మార్కెట్ లను అత్యాదునిక హంగులతో నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరిష్ రావ్ తెలిపారు. ఆయన బి ఆర్ కె భవన్ లో మార్కెటింగ్ శాఖ పనితీరును  సమీక్షించారు. నగర అవసరాలకు సరిపోయే విదంగా గడ్డి అన్నారం మార్కెట్ ను కోహెడకు, మలక్ పేట మార్కెట్ ను పటాన్ చెరు కు తరలించనున్నట్లు, అందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు మార్కెట్ ల నిర్మాణం పై సమగ్ర నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని మంత్రి  ఆదేశించారు. అలాగే ఈ -నామ్, కోల్డ్ స్టోరేజ్ లు, ఖరీఫ్ దిగుబడుల సేకరణ తదితర అంశాలపై హరిష్ రావు సమీక్షించారు.
 

అన్నాడీఎంకేలో మరో ముసలం

అన్నాడీఎంకే  పార్టీలో  వైరి వర్గాల కలయికతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న వేళ  మరో  ముసలం మొదలైంది. పార్టీనుంచి తనను, తన మేనత్తను బహిష్కరించిన పార్టీకి మరియు ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు టీటీవి దినకరన్. ఇప్పటికే తనకు మద్దతిస్తున్న 19 మంది ఎమ్మెల్యేలతో కలిసివెళ్లి గవర్నర్ కి ప్రభుత్వంపై పిర్యాదు చేశారు. అయితే  ఈ ఎమ్మెల్యేలు చేయిజారకుండా వుండేందుకు వారిని పాండిచ్చెరీలోని ఓ రిసార్టుకు తరలించారు. ప్రభుత్వంలోని మరికొంతమంది శాసనసభ్యులు కూడా ఈ క్యాంపులో చేరనున్నట్లు ఆయన తెలిపాడు.
ఈ ప్రకటనతో అలెర్ట్ అయిన ప్రభుత్వం  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎమ్మెల్యేలు చేజారకుండా వుండేందుకు వారితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సీఎం పళని స్వామి. వారితో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.   
 

పన్నీరుకు అదనపు శాఖలు

తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తన మంత్రి వర్గంలో పలు మార్పులు చేశారు. ఇప్పటికే పన్నీరు సెల్వాన్ని ఉపముఖ్యమంత్రిని చేసిన ప్రభుత్వం,  మరికొన్ని అదనపు మంత్రిత్వ శాఖలు ఆయన కేటాయించింది. ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, ఎన్నికలు, పాస్‌పోర్ట్స్‌ శాఖలను అదనంగా అప్పగించారు. ఇపప్పటివరకు ఈ శాఖలు చూసుకుంటున్న జయకుమార్ కు మత్స్యశాఖ‌, పరిపాలన సంస్కరణల శాఖలను కేటాయించారు. దీనిపై గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు మంగళవారం అధికారిక ప్రకటన వెలువరించారు.  
 

క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


కేంద్ర ప్ర‌భుత్వం 2017 సంవత్సరానికి క్రీడా అవార్డుల ప్ర‌క‌టించింది. పారా అథ్లెట్ దేవేంద్ర జఝారియా, హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్ లను రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డుకు ఎంపికచేసింది. అలాగే ద్రోణాచార్య అవార్డులను ఆర్.కే. గాందీ,హీరానంద్ కటారియా, జీఎస్ ప్రసాద్, పీఏ రాఫెల్,బ్రిజ్ భూష‌ణ్ మోహంతి, సంజయ్ చక్రవర్తి,రోషన్ లాల్ లను ఎంపికచేశారు.అలాగే  వీజే సురేఖ‌ , కుష్బీర్ కౌర్‌ , అరోకియా రాజీవ్‌  , ప్ర‌శాంతి సింఘ్‌, సుబేదార్ లైసిరామ్ దేబేంద్రో సింగ్‌, చ‌తేశ్వ‌ర పుజారా, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌, ఓయిన‌మ్ బెంబీ దేవీ, ఎస్‌పీ చ‌వ‌రాసియా, ఎస్‌వీ సునీల్‌, జ‌స్వీర్‌సింగ్‌, పీఎన్ ప్ర‌కాశ్‌, ఏ అమ‌ల్‌రాజ్‌, సాకేత్ మైనేని, స‌త్య‌వ‌ర్తి క‌డియ‌న్‌, మ‌రియ‌ప్ప‌న్‌, వ‌రున్ సింగ్ భాటియా లకు అర్జున అవార్డులు ప్రకటించింది. ద్యాన్ చంద్ అవార్డులను భూపేంద్ర సింగ్‌, స‌య్యిద్ షాహిద్ హ‌కిమ్‌, సుమ‌రాయ్ టీటీ లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే అర్జ‌ున అవార్డులు పొందినవారిలో తెలుగు క్రీడాకారులు వి.జ్యోతి సురేఖ (విలు విద్య‌), సాకేత్ మైనేని (టెన్నిస్‌) లు ఉన్నారు.  

ఏపీలో నలుగురు ఐపిఎస్‌ల బదిలీ

అమరావతి : నలుగురు ఐపిఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. చింతూరు ఓఎస్డీగా కేకేఎన్‌ అంబురాజన్‌, నర్సీపట్నం ఓఎస్డీగా సిఆర్థ్‌ కౌశల్‌, పులివెందుల ఏఎస్పీగా బి.కృష్ణారావు, పార్వతీపురం ఏఎస్పీగా అమిత్‌ బర్దార్‌ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నంద్యాల ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్

నంద్యాల ఉప ఎన్నికల్లో ‌ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నంద్యాలకు చెందిన కిరణ్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేసాడు.అయితే సమయం తక్కువగా ఉన్నందున   రిట్ పిటీషన్ ను విచారించలేమని తెలిపిన న్యాయస్థానం, ఫిల్ దాఖలు చేయలని ఆదేశించింది.
 

నేరెళ్ల ఘటనను విచారణకు స్వీకరించిన హైకోర్ట్

సిరిసిల్ల జిల్లా నెరేళ్ల లో దళితులపై జరిగిన దాడి గురించి  జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖ ను ఫిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్) గా స్వీకరించి , విచారణను చేపట్టనున్నట్లు ఉమ్మడి హైకోర్టు వెల్లడించింది. ఈ నెల 30  వ తేదీన విచారణ ప్రారంభించనున్నట్లు హైకోర్టు తెలిపింది .  అయితే ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ఆయన రాసిన లేఖను కోర్టు విచారణకు స్వీకరించడంతో అధికార పక్షం ఆందోళన చెందుతోంది.
 

ఇక ప్రభుత్వ దవాఖానలోనే అన్ని సేవలు

సిరిసిల్ల లోని ఏరియా హాస్పిటల్ లో ICU,  డయాలిసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ లను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం రూ.27.74 లక్షలతో నిర్మించనున్న నర్సింగ్ కాలేజీకి,  మాతా శిశు వైద్యశాలకు శంకుస్థాపన చేసారు. తర్వాత హాస్పిటల్  లో  రోగులతో మాట్లాడిన వారు ,  హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 
 

మెగాస్టార్ 151 సినిమాకు టైటిల్ ఖరారు

చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన 151 వ మూవీ టైటిల్ ను ఖరారు చేసారు.  ఆయనకు పుట్టిన రోజు కానుకగా ‘సైరా నరసింహరెడ్డి’ పేరుతో గల పోస్టర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు.

గవర్నర్ ను కలిసిన దినకరన్

 

తమిళనాడు లో మైనారిటి ప్రభుత్వం కొనసాగుతోందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే బహిషృత నేత దినకరన్ గవర్నర్ ను కోరారు.  ఆయనకు మద్దతిస్తున్న 19 మంది ఎమ్మెల్యేలను తీసుకుని గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ పిగర్ 117 కాగా, పళని స్వామి వర్గంలో 114 మంది ఎమ్మెల్యేలె వున్నారని,అందులోకూడా తన మద్దతుదారులు వున్నారని గవర్నర్ కు  వివరించారు  దినకరన్. అందువల్ల ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ను కోరారు.   

కృష్ణా బోర్డు సమావేశం
 

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం విజయవాడలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ, కార్యదర్శి సమీర్ చటర్జి లతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ అదికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాలు, వాటి పరిష్కార మార్గాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.     

కోటంరెడ్డి విచారణ షురూ

క్రికెట్ బెట్టింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ శరత్ కుమార్  నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే గతంలోనే దీనిలో తనపై ఆరోపనలు వచ్చాయని. అయితే స్వయంగా జిల్లా ఎస్పీ నే తన పాత్ర లేదని తేల్చారని కోటంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వైసీపిపై బురదజట్టడానికే మళ్లీ ఈ కేసును తిరగదోడారని ప్రభుత్వాన్ని విమర్శించారు కోటంరెడ్డి.  

ట్రిపుత్ తలాక్ పై రెండుగా చీలిపోయిన సుప్రీం న్యాయమూర్తులు 

ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మద్య భిన్నాబిప్రాయాలు వెలువడ్డాయి.దీనిపై విచారించాన ఐదుగురు సభ్యులలో తలాక్ రాజ్యాంగ విరుద్దమని ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడగా, మరో ఇద్దరు తలాక్ ను సమర్ధించారు.  వ్యతిరేకించిన వారిలో  జస్టిస్ నారిమన్, జస్టిస్ కురియన్,జస్టిస్ లలిత్ లు వుండగా, సమర్థించిన వారిలో చీప్ జస్టిస్ ఖేహర్,జస్టిస్ నజీర్ లు వున్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం తీర్పు వెలువరించింది.   

ట్రిపుల్ తలాక్ పై ఆరునెలల్లో చట్టం

ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.   తలాక్ పై ఉన్న అభ్యంతరాలపై చట్టం చేయాలని పార్లమెంట్ కు సూచించింది. చట్టంలో మార్పుల ద్వారానే వ్యవస్థను మార్చవచ్చని తెలిపింది దర్మాసనం. చట్టం చేసేవరకు దీనిపై ఎలాంటి పిటిషన్లు స్వీకరించమని తెలిపిన కోర్టు, చట్టం తేవడానికి పార్లమెంట్ కు 6 నెలల సమయం ఇస్తున్నట్లు పేర్కొంది. అప్పటివరకు దీనిపై స్టే విధిస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఆబ్కారిభవన్ లో సిట్ అధికారుల సమావేశం 

ఈరోజు ఆబ్కారి భవన్ లో సిట్ మరియు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల‌ సమావేశం కానున్నారు. వారితో పాటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఇటీవల బయటపడ్డ డ్రగ్స్ వ్యవహారంపై చర్చించనున్నారు. నగరంలో విదేశీ డ్రగ్స్ ముఠాల ఆగడాలు అంతకంతకు పెరుగుతుండటంతో దీనికి చెక్ పెట్టాలని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల‌ు భావిస్తున్నారు. అందుకోసం విదేశాల నుండి దిగుమతవుతున్న డ్రగ్స్ వ్యవహారం పై వారు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో కనిపించిన సంపూర్ణ సూర్య గ్రహణం వీడియో

 

ఉపరాష్ట్రపతి ఆంద్రప్రదేశ్ పర్యటన

అమరావతి : తెలుగుతేజం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26న ఆయన పర్యటన ఖరారయింది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్  అధికారులు ఖరారు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోన శశిధర్ వెంకయ్య పర్యటన వివరాలు తెలిపారు. వెంకయ్యనాయుడు రాకను పురస్కరించుకుని 26న ఆత్మీయ సన్మానం చేయనున్నమని, అనంతరం రాష్ట్ర అర్బన్ హౌసింగ్ కార్యక్రమంలో  పాల్గొంటారని తెలిపారు. తర్వాత తెనాలిలో జరగనున్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొంటారని కతెక్టర్ తెలిపారు.

 

click me!