బతుకమ్మ సంబరాల్లో సతీసమేతంగా పాల్గొన్న మంత్రి (వీడియో)

First Published Sep 27, 2017, 11:22 AM IST
Highlights

విశేష వార్తలు

  • హైదరాబాద్ లో మరో దొంగ బాబా అరెస్ట్
  • హైదరాబాద్ లో యువతిపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు
  • వైఎస్ భారతీరెడ్డి కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
  • విశాఖ గంగవరం పోర్టులో క్రేన్ ప్రమాదంలో ఇద్దరు కార్మకుల మృతి
  • ఆదిలాబాద్ ఎంపి నగేష్ ఇంట్లో చోరికి పాల్పడిన దొంగలు

బతుకమ్మ సంబరాల్లో సతీసమేతంగా పాల్గొన్న మంత్రి (వీడియో)

మహబూబ్ నగర్ జడ్చర్లలో  కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలో భార్య  శ్వేతా లక్ష్మారెడ్డి తో కలిసి కోలాటం ఆడారు. బతుకమ్మలను స్వయంగా మంత్రి ఎత్తుకొని సందడి చేశారు.  స్థానిక మహిళలతో కలిసి కోలాహలం చేసారు మంత్రి సతీమణి శ్వేతా లక్ష్మా రెడ్డి.
 

తిరుమల మాడవీధుల్లో ఏనుగు హల్ చల్

తిరుమల మాడవీధుల్లో ఓ ఏనుగు హల్ చల్  సృష్టించింది. బ్రహ్మోత్సవాల కోసం తీసుకువచ్చిన ఏనుగు ఒకటి భక్తులపైకి దూసుకురావడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీసారు. అయితే వెంటనే అప్రమత్తమైన మావటి మద ఏనుగును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని సంభవించలేదు.
 

మరో దొంగబాబా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మరో దొంగబాబా బాగోతం బయటపడింది. భవిష్యవాణి పేరుతో భక్తులనుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న నర్సింహాచార్యులు అనే బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులకు పిర్యాధు చేయడంతో  ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి 5 తక్షల నగదు, ఓ కారు, ఐదు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  
 

మృత్యునిలయంగా మారిన అనంతపురం ప్రభుత్వాసుపత్రి

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ 8 మంది మృత్యువాత పడ్డారు. వేరు వేరు కారణాలతో ఫెషెంట్ లు చనిపోయినప్పటికి ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించడంతో మిగిలిన రోగులతో పాటు, డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర జ్వరం కారణంగా నలుగురు, ఆయాసంతో ఇద్దరు, గుండె పోటుతో ఒకరు, కడుపు నొప్పితో బాధపడుతూ ఇలా మొత్తం 8 మంది చనిపోయారు. ఈ మరణాలపై హాస్పిటల్ సూపరిండెంట్ మాట్లాడుతూ...వీరంతా తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది, పరిస్థితి విషమించాక ఈ హాస్పిటల్ కు రావడంతో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
 

బీమిలిలో బొలేరో వాహనం భీభత్సం

విశాఖపట్టణం: బిమిలి పట్టణంలో ఓ బొలేరో వాహనం భీభత్సం సృష్టించింది. అతివేగంతో ప్రయాణిస్తూ జనాలపైకి దూసుకెళ్లడంతో  ఇద్దరు బాటసారులు దుర్మరణంపాలయ్యారు. వివరాల్లోకి వెళితే బిమిలి తహసీల్దార్ కార్యలయ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న జనాలపైకి అతివేగంగా వెళ్లోన్న ఓ బొలేరో వాహనం దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాదస్థలంలోనే మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
 

చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

వరంగల్ రూరల్ జిల్లా : చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో దారుణం జరిగింది.  గ్రామ సమీపంలోని ఊర చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన చిన్నారులు గుంజేల అజయ్, సాయి, అఖిల లుగా గ్రామస్తులు గుర్తించారు. చిన్నారులు మరణంతో వారి కుంటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
 

కబడ్డి ఆటలో ఘర్షణ, ఓ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ధారుణం జరిగింది. సరదాగా కబడ్డి ఆడుతున్న ఇద్దరు విద్యార్థుల మద్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే దసరా సెలవులు కావడంతో ఊళ్లో విద్యార్థులు సరదాగ కబడ్డీ పోటీ పెట్టుకున్నారు. అయితే ఇందులో పాల్గొన్న అర్జున్ అనే విద్యార్థికి మల్లికార్జున్ కి మద్య మాటా మాటా పెరిగి గొడవ  మొదలైంది. దీంతో అర్జున్ మల్లిఖార్జన్ ను చితకబాదడంతో  ఈ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.  

యువతిని వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్ 

ఒంటరిగా ఉన్న యువతిపై వేధింపులకు దిగిన ఓల క్యాబ్ డ్రైవర్ ను షీ టీం పోలీస్ లు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గౌలిగూడా నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ఓ యువతి క్యాబ్ ను ఆశ్రయించింది. అయితే ఈ యువతిపై కన్నేసిన క్యాబ్ డ్రైవర్ శివకుమార్ కారును దారి మళ్లించి యువతిపై వేదింపులకు దిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడంతో యువతి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో వనస్థలి పురం షీ టీం పోలీస్ క్యాబ్ ను గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
 

వైఎస్ భారతీరెడ్డి పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నూజివీడు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కాల్‌మనీ కేసులో తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే విచారణ సంధర్భంగా సాక్షి ప్రతినిధులెవరు కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి  కోర్టు వారెంట్‌ను జారీ చేసింది.

ఆదిలాబాద్ ఎంపి నగేష్ ఇంట్లో చోరి 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎంపి గోడెం నగేష్ ఇంట్లో అర్థరాత్రి చోరి జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్ట్  కాలనీలోని ఆయన ఇంట్లో కుటుంబసభ్యులు ఎవరు లేని సమయంలో దొంగలు తెగపడ్డారు. ఇంటి తాళాలను పగలగొట్టిన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. ఇంట్లోని సిసి కెమెరాల పుటేజిని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ పోర్టులో క్రేన్ ప్రమాదం, ఇద్దరు మృతి

విశాఖపట్నం లోని గంగవరం పోర్టులో ప్రమాదం జరిగింది. షిప్ లోకి ఇనుప కడ్డీలను లోడ్ చేస్తుండగా క్రేన్ హుక్ తెగిపడి కార్మికులపై పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన కార్మికులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు  సబ్బవరానికి చెందిన సూర్య ప్రకాశ్, సతీష్ లు గుర్తించారు.  

click me!