మీ బ్రాండ్ దొరక్కపోతే ఇంట్లో పడుకోండి: బొండా ఉమకు జోగీ రమేశ్ రిప్లై

By Siva KodatiFirst Published Mar 3, 2020, 5:58 PM IST
Highlights

11 గంటలకు వైన్ షాప్ తెరిస్తే.. రాత్రి 8 గంటలకు షాప్ క్లోజ్ చేస్తున్నామని, టీడీపీ నేతలకు వాళ్ల బ్రాండ్లు దొరక్కపోతే ఇంట్లో పడుకోవాలని జోగీ సెటైర్లు వేశారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజలెవ్వరూ తెలుగుదేశం పార్టీతో లేరని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్. 

11 గంటలకు వైన్ షాప్ తెరిస్తే.. రాత్రి 8 గంటలకు షాప్ క్లోజ్ చేస్తున్నామని, టీడీపీ నేతలకు వాళ్ల బ్రాండ్లు దొరక్కపోతే ఇంట్లో పడుకోవాలని జోగీ సెటైర్లు వేశారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజలెవ్వరూ తెలుగుదేశం పార్టీతో లేరని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలకు ముందు వరకు 20 - 25 శాతం మంది బలహీన వర్గాల ప్రజలు టీడీపీకి వుండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం మాత్రం 95 శాతం మంది బలహీన వర్గాల ప్రజలు వైసీపీతోనే ఉన్నారని రమేశ్ చెప్పారు.

బీసీలకు మేలు చేద్దామని బీసీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని రమేశ్ గుర్తుచేశారు. కోర్టులో పిటిషన్ వేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి టీడీపీ నేత అయినప్పటికీ, రెడ్డి అనే పేరుచెప్పి వైసీపీ నేతగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read:వారు నారావారు కాదు సారావారు: చంద్రబాబుపై రోజా ‘జబర్దస్త్’ కామెంట్స్

సోమిరెడ్డి పేరులో కూడా రెడ్డి ఉంది అంతమాత్రాన సోమిరెడ్డి వైస్సార్సీపీకి చెందిన నాయకుడా అని రమేశ్ ప్రశ్నించారు. బిర్రు ప్రతాప్ రెడ్డికి చంద్రబాబు ఉపాధి హామీ పథకంలో నామినేటెడ్ పదవి కట్టబెట్టారని జోగీ గుర్తుచేశారు.

టీడీపీలో ఉన్న బీసీ నేతలు చంద్రబాబు తొత్తులుగా మారారని.. బీసీలకు పెద్ద పీఠ వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అభినవ పూలేగా వ్యవహరిస్తున్నారని జోగీ రమేశ్ స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు సీఎం 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆయన గుర్తుచేశారు.

చంద్రబాబు బీసీ రిజర్వేషన్లు అడ్డుకొని మళ్ళీ సుప్రీంకోర్టు కు వెళ్ళమని సలహా ఇస్తున్నారని.. బీసి ద్రోహి చంద్రబాబు నాయుడని జోగీ ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని చంద్రబాబు, లోకేష్ నెత్తిన పెట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు బలహీనవర్గాలకు అందుతున్నాయని ఆయన చెప్పారు. జగన్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసమేనని జోగి చెప్పారు.

బొండా, బుద్ధా, లోకేశ్ బాబు ఆయన ఫ్రెండ్స్ తాగే బ్రాండ్లు ఏంటో రాసివ్వాలంటూ ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల బెల్ట్ షాపులు మూసివేశామని, బ్రాందీ షాపులు, బార్లు తగ్గించేశామని జోగీ రమేశ్ స్పష్టం చేశారు.  

మందుబాబులకు బ్రాండ్ దొరక్కపోతే ఇంట్లోకెళ్లి పడుకుంటాడని అతనికి లేని బాధ బొండా ఉమాకి ఎందుకని ఆయన ప్రశ్నించారు. మందు రేట్లు పెంచితే, బ్రాండ్లు దొరక్కపోతే ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటో తనకు అర్ధం కావడం లేదన్నారు.

Also Read:లోకేష్ రాజమండ్రి టూర్‌లో ఉద్రిక్తత:చెప్పులు, కుర్చీలు విసిరిన ఆందోళనకారులు

బెల్ట్‌షాపులు, బ్రాందీ షాపులు, బార్లు మూసివేస్తుండటంతో రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లు పండగ చేసుకుంటున్నారని జోగీ రమేశ్ వెల్లడించారు. టీడీపీ నాయకులకు ఏ బ్రాండ్లు దొరకడం లేదో చెబితే తెప్పిస్తానని రమేశ్ సెటైర్లు వేశారు.

చింతచచ్చినా.. పులుపు చావలేదన్నట్లు ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ నేతలు ఇంకా రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఖజానాకు ఆదాయం తగ్గినా.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని చెప్పి మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నారని జోగీ రమేశ్ స్పష్టం చేశారు.

ఎనిమిది నెలల కాలంలో నవరత్నాలను గడప గడపకు తీసుకెళ్లామని ఆయన తెలిపారు. 60 లక్షల మంది పెన్షన్ దారులకు.. ఉదయం ఆరు గంటలకే నిద్రలేపి వాళ్లకి పెన్షన్ ఇచ్చామని రమేశ్ గుర్తుచేశారు. 
 

click me!