మంత్రి పదవికి రాజీనామా చేస్తాం... ఎప్పుడంటే..: మోపిదేవి

By Arun Kumar PFirst Published Jan 29, 2020, 4:53 PM IST
Highlights

ఏపి శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దునకు సంబంధించి క్లియరెన్స్ త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి, వైసిపి ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.  రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మండలిని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని... దాన్ని తాము గౌరవిస్తామన్నారు. 

మండలి రద్దు విషయంలో కేంద్రం నుంచి క్లియరెన్స్ రాగానే రాజీనామా చేయడానికి సిద్దమేనని మోపిదేవి వెల్లడించారు. టీడీపీ వాళ్లు చెబితే రాజీనామాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. టీడీపీ తరహాలో తాము పదవుల కోసం అర్రులు చాచే రకం కాదని....  ఎవరి ట్రాప్ లోనూ తాము పడలేమన్నారు మంత్రి మోపిదేవి. 

శాసనమండలి ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలకు పరిమితం కాకుండా ఏకంగా నిర్ణయాలనే అడ్డుకునే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన బిల్లులను సైతం అడ్డుకున్నారని... సెలెక్ట్ కమిటీకి పంపిన రెండు బిల్లులు అలాంటివేనని అన్నారు. అత్యంత ప్రాధాన్యమైన బిల్లులను ఎలా అడ్డుకుంటారు..?  అని మోపిదేవి ప్రశ్నించారు. 

read more  జగన్ ది రహస్య పర్యటన... వైఎస్ కుటుంబమే నమ్మట్లేదు...: వర్ల రామయ్య

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ బ్యాంకుకు నష్టం జరుగుతుందనే బిల్లులను టీడీపీ అడ్డుకుందని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నా శాసన మండలిని చంద్రబాబు కనుసన్నల్లో ఎలా పెట్టుకుంటారు..? అని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి అభివృద్దిని అడ్డుకునే మండలి రద్దు చేయడం మంచి నిర్ణయమేనని మోపిదేవి పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఆక్వా రంగానికి జాతీయ స్థాయిలో 40 శాతం వాటా ఉందన్నారు. మెరైన్ రంగానికి సంబంధించి ఫిషింగ్ జెట్టిస్ నిర్మానానికి స్పెషల్ డ్రైవ్  చేస్తున్నామని..ఆక్వా రంగానికి పవర్  టారిఫ్ విషయం లో మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. 

read more  ఏపిలోనూ వాటర్ గ్రిడ్... మొదట ఈ జిల్లాల్లోనే...: కన్నబాబు

ఫిషింగ్ జెట్టిస్ ఏర్పాటు లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలు గుర్తించామన్నారు. ఏపీ లో  ప్రధానంగా ఉన్న వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ను 100 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మత్స్యకారులకు మంచి రోజులు వస్తాయన్నారు మంత్రి మోపిదేవి. 


 

click me!