''వైఎస్ వివేకా హత్య కేసులో సునీత చిక్కులు: హైదరాబాద్ కు రహస్యంగా జగన్''

By Arun Kumar PFirst Published Jan 29, 2020, 4:12 PM IST
Highlights

ముఖ్యమంత్రి జగన్ ను సొంత కుటుంబమే నమ్మట్లేదని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు ఆయన కుటుంబ సభ్యులకు కూడా అర్థం కావడంలేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కోన్నారు. వైస్ వివేకా హత్య జరిగినప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాక మడమ తిప్పారని అన్నారు. అసలు ఈ కేసు నుంచి ఎవరిని తప్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు? అని ప్రశ్నించారు. 

తండ్రి మరణంతో వైస్ సునీత మనోవేదన రిట్ పిటిషన్ లో కనిపిస్తోందన్నారు. తండ్రి హత్యపై సునీత పిటిషన్ వేయగానే జగన్ హైదరాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టుకున్నారని... ఆయనలో చాలా ఆందోళన కనిపిస్తోందన్నారు. జగన్ హైదరాబాద్ పర్యటనను సీఎంఓ ఎందుకు రహస్యంగా ఉంచిందని  రామయ్య ప్రశ్నించారు. 

సీఎం జగన్ పెద్ద జాదు అని విమర్శించారు. ఆయన ఉన్నపళంగా లోటస్ పాండ్ లో మీటింగ్ పెట్టడంవెనక గుట్టు ఏంటి? అని ప్రశ్నించారు. తన సోదరి ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. 

వివేకా హత్య కేసులో ఎవరు ప్రశ్నించినా నోటీసులు ఇస్తారా?. కేసు సీబీఐకి ఇస్తే అరెస్ట్ చేస్తారని మీరు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. వైస్ వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వాల్సిందేనని రామయ్య కూడా డిమాండ్ చేశారు. 

read more  వైఎస్ వివేకా హత్య కేసు: పేర్లు వెల్లడించిన కూతురు సునీత. జాబితా ఇదే...

ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.

వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కూతురు మరో పిటిషన్ వేశారు. తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే సీఎం జగన్, వివేకా భార్య, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేయగా... తాజాగా వివేకా కుమార్తె సునీత కూడా వేశారు.

అయితే... వివేకా హత్య కేసు విచారణ తుది దశలో ఉన్నందున సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వ తేల్చిచెప్పింది. ఈ అన్ని పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని  టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు ఈ కేసు విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని  కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని పరమేశ్వర్ రెడ్డి కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

read more  వివేకా హత్యపై హైకోర్టులో సునీత పిటిషన్: వైఎస్ జగన్ కు చిక్కులు

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధానంగా ప్రస్తావించింది. జగన్ పై ఆ నాడు చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు విమర్శలపై వైసీపీ కూడ ఎదురు దాడికి దిగింది.

అయితే ఈ విషయమై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు హైకోర్టును ాశ్రయించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని హైకోర్టు ఆ సమయంలో ఆదేశాలు జారీ చేసింది. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం కూడ ఈ కేసును కూడ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి చెందిన నేతలను విచారించింది. 

click me!