అన్నా క్యాంటిన్ల పునఃప్రారంభం ... కొత్త పద్దతిలో: బొత్స

By Arun Kumar PFirst Published Dec 17, 2019, 5:21 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటిన్లు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా వాటిని ఒ కొత్త పద్దతిలో పున:ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.  

అమరావతి: గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం ప్రభుత్వం కేవలం తమ కార్యకర్తల కోసమే అనేక పథకాలను ప్రవేశపెట్టారని మున్సిపల్ శాఖామంత్రి  బొత్స సత్యనారాయణ  తెలిపారు. ఇలాగే అన్నా క్యాంటిన్లను కూడా పేదల ఆకలిబాధలు తీర్చడానికి కాకుండా టిడిపి కార్యకర్తల కోసమే ఏర్పాటుచేశారని ఆరోపించారు. అందుకోసమే క్యాంటిన్లంటినీ టిడిపి కార్యాలయాల సమీపంలోనే ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. 

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా ఓ సభ్యుడు అన్నా క్యాంటిన్లపై అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు. సామాన్య ప్రజలు వున్న చోట కాకుండా తమ పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశారని... ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ క్యాంటీన్లు పెట్టారని విమర్శించారు. ఓ పద్దతిప్రకారం  క్యాంటిన్ల ఏర్పాటు జరగలేదన్నారు.  

read more దిశ చట్టం అమలు...ఎస్పీలకు డిజిపి గౌతమ్ సవాంగ్ సూచనలివే

సబ్సిడీపై ఇచ్చే ఆహారం సామాన్యులకు దక్కలేదని.... వీటన్నింటినీ వైసిపి ప్రభుత్వం పరిశీలించే చర్యలు తీసుకుందన్నారు. అయితే పేదల ఆకలి బాధను తీర్చేలా కొత్తగా క్యాంటిన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

ప్రధానంగా పట్టణాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాన్య జనం ఎక్కువగా వుండే చోట్ల క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే 15 జిల్లా ఆసుపత్రులు, 28 ఏరియా ఆసుపత్రులు, 11 టీచింగ్ ఆసుపత్రుల వద్ద ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు.

read more అధికారులతో గిరిజనులకు ఇబ్బందులు...పరిష్కారానికి సీఎం ఉత్తమ సలహా: మంత్రి శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్యాంటీన్లన్నింటినీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. దీనిపై పలు విమర్శలు ఎదురయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఈ విషయంపై అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన వాటిని ఎందుకు మూసివేశారంటూ ప్రశ్నించారు.  

ఈ నేపథ్యంలో దీనిపై  గతంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘‘ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కాం జరిగింది. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారు. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు 30-50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారు.’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

"5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టులో అందినకాడికి దోచుకుందామని చూశారే తప్ప పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబు ఏనాడూ చూపలేదు. ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే సగం రాష్ట్రం జలసిరితో సస్యశ్యామలమయ్యేది. రోజుకు 60 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలయ్యేది కాదు" అని గత ప్రభుత్వంపై విజయసాయి తీవ్ర విమర్శలు గుప్పించారు.  

click me!