తెలంగాణకు రెడ్ అలర్ట్..
రాబోయే రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. క్రమక్రమంగా ఉష్ఱోగ్రతలు పెరుగుతాయని... 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మే 14,15,16 (బుధ, గురు, శుక్రవారం) మూడ్రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక కొన్ని జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి రెడ్ అలర్ట్ జిల్లాల ప్రజలే కాదు తెలంగాణ ప్రజానీకమంతా ఎండల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.