తెలంగాణలో జోరువానలు..
ఇప్పటికే రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి... ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రుతుపవనాలు కొన్నిచోట్లకు చేరుకోగా రాబోయే 4 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ మీదుగా ఏపీలోని కోస్తాంధ్ర వరకు ఓ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో నేడు (జూన్ 18, గురువారం) తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ. సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది.
ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కాబట్టి వర్ష సమయంలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.