Narasimha Swamy Temple: తెలంగాణలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ విశేషాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి అరుదైన ఆలయాల్లో ములుగు జిల్లా మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంది. పచ్చని అటవీ ప్రాంతం, కొండలు, ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. భద్రాచలం–ఏటూరునాగారం రహదారి నుంచి మంగపేట వద్దకు చేరుకుని అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.
26
మనిషి చర్మంలా మెత్తగా ఉండే విగ్రహం
ఈ ఆలయంలోని లక్ష్మీనరసింహస్వామి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. భక్తులను ఎక్కువగా ఆకర్షించే అంశం స్వామివారి విగ్రహ నిర్మాణమే. స్థానిక విశ్వాసాల ప్రకారం, విగ్రహంలోని కొన్ని భాగాలు మానవ చర్మంలా మృదువుగా ఉంటాయని చెబుతారు. స్వామివారిని అభిషేకించే అర్చకులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. దేశంలోని అనేక నరసింహ క్షేత్రాల్లో కనిపించని ప్రత్యేకతగా దీనిని భక్తులు భావిస్తారు.
36
విగ్రహానికి సంబంధించి ఆసక్తికర విశ్వాసం
మల్లూరు క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణంలో ఒక విశేష కథనం ఉంది. ప్రాచీన కాలంలో భూమిలో దాగి ఉన్న విగ్రహాన్ని వెలికితీసే సమయంలో కడుపు భాగానికి గాయం అయ్యిందని చెబుతారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం నుంచి ద్రవం లాంటి పదార్థం స్రవిస్తుంటుందని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం అక్కడ చందనం అర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే శుభఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ సమీపంలో నిరంతరం ప్రవహించే చిన్న జలధారను "చింతామణి జలధార"గా పిలుస్తారు. కొండ ప్రాంతం నుంచి వెలువడే ఈ నీరు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని స్థానికులు చెబుతారు. అనేక మంది భక్తులు ఈ నీటిని పవిత్ర తీర్థంగా భావించి ఇంటికి తీసుకెళ్తుంటారు. కాకతీయుల కాలంలో ఈ జలధారకు ప్రాధాన్యం పెరిగిందని, రాణి రుద్రమదేవి కాలంతోనూ దీనికి సంబంధం ఉందని స్థానిక కథనాలు పేర్కొంటాయి.
56
ఆలయ దర్శన సమయాలు, ఉత్సవాల ప్రత్యేకత
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి వేడుకలకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం, విశేషమైన నమ్మకాలతో మల్లూరు క్షేత్రం తెలంగాణలోని ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది.
66
చీకటి పడితే భయం
ఉదయమంతా భక్తులతో సందడిగా కనిపించే నరసింహుని కొండ పై భాగం, పొద్దుపోయిన తరువాత నిశ్శబ్దంగా మారుతుంది. ఆ సమయంలో కొండపైకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు. చీకటి పడిన తరువాత స్వామివారు కనిపించే తీరు వేరుగా ఉంటుందనీ, రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు కొండపై నుంచి సింహ గర్జనలు వినిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. సింహరూపంలో స్వామివారు అక్కడ తిరుగాడిన ఆనవాళ్లు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈ కారణంగానే స్వామివారిని కేవలం ఉదయం వేళలో మాత్రమే దర్శించుకుంటూ ఉంటారు. సాయంత్రం తర్వాత స్వామివారు అడవిలో సంచరిస్తారనే విశ్వాసంతో ఆలయాన్ని మూసివేస్తారు.