
Heavy Rain Alert : ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది... ఇది ముందుకు కదులుతూ మరింత బలపడుతోందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా యాక్టివ్ గా మారాయి... దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఈ రెండ్రోజులు (ఆగస్ట్ 24,25) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు మరీముఖ్యంగా రైతులకు కాస్త ఊరట లభించింది.
తెలంగాణలో నిన్నటి (ఆగస్ట్ 23, ఆదివారం) నుండి వర్షాలు మొదలయ్యాయి. ఈ రెండ్రోజులు (సోమ, మంగళవారం) వానలు మరింత ఊపందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తెలంగాణలోని కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందట. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలావుంటే ఇవాళ (ఆగస్ట్ 24) ఉదయం కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి తో పాటు హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉదయం 10 గంటల వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా ఈ రెండ్రోజులు (ఆగస్ట్ 24, 25) రాష్ట్రవ్యాప్తంగా జోరువానలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా నార్త్, ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 60-70 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం,యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఇప్పటికే వర్షాలు జోరందుకున్నాయి... ఇకపైనా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు... ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి. పరివాహక ప్రాంతాల్లోకి నీరు చేరి వరదలు సంభవించే అవకాశాలుంటాయి.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. లోతట్టుప్రాంతాల ప్రజలు కూడా ఈ రెండ్రోజులు జాగ్రత్తలు ఉండాలని సూచించారు.
ఆదివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 6.5 సెంటిమీటర్లు (65 మి.మీ) వర్షపాతం నమోదయ్యింది. కామారెడ్డి జిల్లా పిట్లంలో 5.1 సె.మీ, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 5.1 సెం,మీ, మెదక్ జిల్లా నర్సాపూర్ లో 4.7 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కల్హేర్ లో 4.2 సెం.మీ, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రేపు, ఎల్లుండి (ఆగస్ట్ 24, 25) ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని APSDMA సూచించింది.
ఇవాళ (ఆగస్ట్ 24, సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం ఉంటుందని APSDMA తెలిపింది. ఇక పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు... మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తు సంస్థ హెచ్చరిస్తోంది...కాబట్టి తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచించింది.