Rain Alert
Rain Alert : ఇది ఎండాకాలమా లేక వానాకాలమా అన్నట్లుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా సాయంత్రం అయ్యిందంటే మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నారు. అప్పుడప్పుడు వడగళ్ల వానలు పడుతున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఎండా వాన పరిస్థితి నెలకొంది.
తాజాగా మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు వెలువడ్డాయి. రాబోయే రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని... అలాగే కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఉండనుంది.
Telangana weather
తెలంగాణ వాతావరణ సమాచారం :
తెలంగాణలో ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం కొమరంభీమ్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. కొన్నిచోట్ల వర్షం పడకుండా ఆకాశం మేఘాలతో కమ్ముకుని వాతావరణం చల్లగా ఉంటుంది.
శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం అంతా ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురవనున్నాయి. చిరుజల్లుల కారణంగా వాతావరణ ఆహ్లాదకరంగా మారిపోనుంది... కానీ ఈ ఎండాకాలం వర్షాలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని... పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈదురుగాలుల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి... కాబట్టి చెట్లు, పెద్దపెద్ద హోర్డింగ్స్ కి దూరంగా ఉండాలి. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే ఈ రెండ్రోజులు పలు జిల్లాల్లో ఎండలు కూడా మండిపోనున్నాయట. ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్టంగా 42 డిగ్లీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హన్మకొండ, భద్రాచలంలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
Andhra Pradesh Weather
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ రెండ్రోజులు ఎండావాన వాతావరణం ఉండనుంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి., సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు పలు జిల్లాల్లో ఇప్పటికే 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, తిరుపతి, కడప, కర్నూల్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే మిగత జిల్లాల్లో కూడా ఎండలు మండిపోనున్నాయి... వడగాలులు వీచే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రజలు మధ్యాహ్న సమయంలో నీడపట్టున ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.