Viral: నాటికోడి రుచి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఎంత ధర ఎక్కువైనా చాలా మంది నాటి కోడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇలాంటి నాటి కోళ్లు ఉచితంగా లభిస్తే. తాజాగా హన్మకొండలో ఇలాంటి ఓ విచిత్ర సంఘటన జరిగింది.
హనుమకొండ జిల్లాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎల్కతుర్తి సమీపంలోని రహదారి పక్కన అకస్మాత్తుగా వేలకొద్దీ నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉత్సాహంతో పరుగులు తీశారు. ఎవరికీ అర్థం కాకముందే అక్కడ ఒక రకంగా “కోడిపందెం” మొదలైంది.
25
హైవేపై ఆకస్మికంగా ప్రత్యక్షమైన కోళ్లు
ఎల్కతుర్తి – సిద్ధిపేట జాతీయ రహదారి పక్కన శనివారం ఉదయం వింత దృశ్యం కనిపించింది. రహదారి పక్కన, పత్తి చేల మధ్య నాటుకోళ్లు పరుగులు పెడుతుండటం చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు వాటిని పట్టుకునేందుకు ముందుకు వచ్చారు. కాసేపట్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ కోళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
35
సంచులతో పట్టుకెళ్లిన గ్రామస్తులు
కొంతమంది ఒక్కటి రెండు కోళ్లు పట్టుకుని వెనుదిరిగినా, మరికొందరు సంచులు, బుట్టలతో వచ్చి పదుల కొద్దీ కోళ్లు సేకరించారు. రహదారి పక్కన నుంచి పత్తి చేల వరకు ప్రజలు పరుగులు పెట్టారు. పిల్లలు, పెద్దలు కలిసి కోళ్ల వేటలో పాల్గొనడంతో ఆ ప్రదేశం హడావిడిగా మారింది. చివరికి ఊరంతా “కోడికూర విందు” వాతావరణంలో మునిగిపోయింది.
ఈ ఘటనపై కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకిందేమో, లేక ఫామ్ యజమానులు ఇన్ఫెక్షన్ కారణంగా వదిలి వెళ్లారేమో అని సందేహిస్తున్నారు. అధికారుల దృష్టికి విషయం వెళ్లడంతో వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు.
55
ఎవరు వదిలారు? ఎందుకు వదిలారు?
స్థానికుల అంచనా ప్రకారం సుమారు రెండు వేల కోళ్లు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు వదిలారు, ఎందుకు వదిలారు అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కొందరు ఫామ్ ట్రక్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కోళ్లు బయటపడిపోయాయేమోనని అంటుంటే, మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వదిలేశారని భావిస్తున్నారు.