ఈ గుడిలో చెప్పులతో కొడతారు.. ఈ ఆలయానికి వెళ్తే తిరుపతి వెళ్లినంత పుణ్యం, ఎక్కడంటే

Published : Nov 08, 2025, 12:53 PM IST

Kurumurthy temple: మ‌న దేశంలో ఎన్నో ప‌విత్ర ఆల‌యాలు ఉన్నాయి. ఒక్కో ఆల‌యంలో ఒక్కో ఆచార‌, వ్య‌వ‌హారాలు ఉంటాయి. అలాంటి ఒక ఆల‌యమే ఇది. ఇక్క‌డ భ‌క్తులు చెప్పుల‌తో కొట్టించుకుంటారు. పేద‌ల తిరుప‌తిగా పేరుగాంచిన ఈ ఆల‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పేదల తిరుపతి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామంలో ఉన్న కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాచీన చారిత్రక స్థలంగా ప్రసిద్ధి పొందింది. తిరుమల దేవాలయానికి సమానమైన ఆత్మీయతతో భక్తులు ఇక్కడకు చేరుతారు. ఈ ఆలయం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యంత పాత దేవస్థానంగా చరిత్రకారులు గుర్తించారు.

25
చారిత్రక నేపథ్యం

1268 సంవత్సర ప్రాంతంలో ముక్కెర వంశానికి చెందిన గోపాలరాయుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత 1350లో చంద్రారెడ్డి ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేశారు. ఆయన కాలంలో కొండపైకి మెట్లు వేసి, ప్రతి ఏడాది జాతర నిర్వహించే సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. 1870లో భక్తుల సౌకర్యార్థం ఉద్దాల మండపం నిర్మించారు. ఈ మండపం ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కాలక్రమేణా గర్భగుడి, గోపురం, ధ్వజస్తంభం, మండపాలు నిర్మించ‌గా.. 1966లో ఈ ఆలయం అధికారికంగా దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది.

35
కురుమూర్తి స్థల పురాణం

పురాణ గాథల ప్రకారం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వివాహం చేసుకున్న తరువాత కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీర్చడంలో విఫలమైనందున మనస్థాపంతో స్వామి కృష్ణానదీ తీరంలోకి వెళ్లారు. జూరాల సమీపంలోని గుండాల జలపాతం వద్ద స్నానం చేసి ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించారు. ఆ సమయంలో లక్ష్మీదేవి కోరిక మేరకు “కురుమూర్తి గిరుల”పై విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడ “కురు” అంటే చేయడం, “మతి” అంటే తలచడం అని అర్థం. అందువల్లే స్వామికి మొదట “కురుమతి” అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది “కురుమూర్తి”గా మారింది. తిరుపతి వీడి కృష్ణానదీ వద్ద స్నానం చేసినప్పుడు శ్రీమహాలక్ష్మి ఇచ్చిన పాదుకలు నేటి ఉద్దాల ఉత్సవంలో ప్రధాన భాగంగా ఉన్నాయి.

45
ఉద్దాల ఉత్సవం – కురుమూర్తి ఆరాధనలో ప్రధాన ఘట్టం

ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఉత్సవం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతం నుంచి తెచ్చిన నాణ్యమైన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలోని దళితులు పాదుకలను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య నుంచి వారంపాటు నియమ నిష్ఠలతో దీక్షలు పాటిస్తూ పాదుకలు తయారీ చేస్తారు. తయారైన పాదుకలను ఆంజనేయస్వామి దేవాలయంలో పూజించి, ఊరేగింపుగా కురుమూర్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ వాటిని ఉద్దాల మండపంలో ఉంచి భక్తులు తలపై లేదా వీపుపై కొట్టించుకుంటారు. ఇలా చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో దళితులు అర్చకులుగా వ్యవహరించడం ఈ దేవాలయ ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు.

55
సంప్రదాయాలు, నిర్మాణాలు, పండుగలు

కురుమూర్తి స్వామి సన్నిధిలో ఉన్న మట్టికుండ ఆచారం మరో ప్రత్యేకత. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు మట్టికుండను తయారు చేస్తారు. ఆ కుండను ‘తలియకుండ మండపం’లో నెల్లి వంశీయులు పూజిస్తారు. ఈ సందర్భంలో డప్పు వాయిద్యాలు, బాణసంచా, ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయంలో 1810–1840 మధ్య ఆంజనేయస్వామి ఆలయం, 1857–78 మధ్య నగారా బంగ్లా, ఉద్దాల మండపం వంటి నిర్మాణాలు రాజా శ్రీరాం భూపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రతి సంవత్సరం హంసవాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంటుంది.

కురుమూర్తి ఎలా చేరుకోవాలి.?

మహబూబ్‌నగర్ పట్టణం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కురుమూర్తి ఉంది.

మహబూబ్‌నగర్ – దేవరకద్ర – కౌకుంట్ల మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు.

కురుమూర్తి రైల్వే స్టేషను ఆలయం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.

7వ నెంబర్ జాతీయ రహదారి (NH-7)పై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories