
Telugu States Weather Updates : సాధారణంగా జూన్ లో వర్షాకాలం ప్రారంభం అవుతుంది... కానీ ఈసారి మే చివర్లోనే వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో మే చివర్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఎండలు మడిపోవాల్సిన మేలో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈసారి వర్షాలకు దోకా లేదని... ఇదే పరిస్థితి వర్షాకాతలమంతా ఉంటుందని అందరూ భావించారు. కానీ మే ముగిసి జూన్ లోకి ఎంటర్ కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేఘాలు ముఖం చాటేసి వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
జూన్ లో తొలకరి జల్లులు ప్రారంభమై విస్తారంగా వర్షాలు కురవాలి... వ్యవసాయ పనులు జోరుగా సాగాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి ఉంది. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి... కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఆశించిన స్థాయి వర్షాలు లేవు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు... వర్షాల కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి నెలకొంది.
ఇలా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 20 నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు జోరందుకోనున్నాయని ప్రకటించారు. ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైనా ఇకపై మాత్రం విస్తారంగా వర్షాలుంటాయని... ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేస్తోంది.
రుతుపవనాలు యాక్టివ్ గా మారడం, బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు(బుధవారం) వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇలా వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసారు... ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మిగతాజిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని... మిగతాచోట్ల వర్షం కురవకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ లో కూడా ఇలాగే మేఘాలు కమ్మేసి చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో నేడు(బుధవారం) కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పెద్దగా వర్షాలు లేకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని.... నార్త్, సౌత్ కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయా, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుసే అవకాశాలున్నాయని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని తెలిపారు. రుతుపవనాల కదలికలు వేగంగా ఉన్నాయని... దీంతో త్వరలోనే వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తింది. ఈ వర్షాలు, వరదల దాటికి ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో వర్షాల దాటికి 18 మంది మరణించగా 65 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇక భారీగా ఆస్తినష్టం జరిగింది. ఇకపై కూడా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిస్తోంది.
ఇలా పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు కూడా వ్యాపించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవనున్నాయన్నమాట. కాబట్టి ఇప్పటికే పంటలు వేసిన, ఇకపై వేయాలని చూస్తున్న రైతులు ఆందోళన చెందవద్దని వాతావరణ విభాగం అధికారులు సూచిస్తున్నారు.