Weather : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదురోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని IMD (ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్) హెచ్చరించింది.
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లుల, కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలా మే నెల మొదటివారమంతా ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు :
ప్రస్తుతం ఉత్తర కోస్తాంద్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ముఖ్యంగా కోస్తాంధ్రలో వాతావరణం చల్లబడి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాయలసీమలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతాయని... గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. సాధారణంగానే మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 డిగ్రీలకు పైగా ఎండలుంటాయి కాబట్టి మధ్యాహ్నం సయమంలో బయటకు రావద్దని... ఈ వేడి నుండి ఉపశమనం కోసం చల్లటి ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఏపీలోని ఏఏ జిల్లాల్లో వర్షాలు?
ఇవాళ (మే 1 గురువారం) శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బిపట్ల, కర్నూల్, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వేసవికాలం వర్షాల సమయంలో పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు :
తెలంగాణలో కూడా ఇవాళ (మే 1 గురువారం) వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ మూడ్రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... సాయంత్రం ఆకాశంలో మేఘాలు ప్రత్యక్షమై వాతావరణ చల్లబడి వర్షం కురుస్తుందని తెలిపారు. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.