Rythu Bharosa : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుందా? ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయా? అంటే ప్రభుత్వ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు చాలామంది రైతులకు రాలేవు.. త్వరలోనే అందరి ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం నిధులు సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు పెట్టుబడిసాయం కింద ఎకరాలకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమచేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలుచేసిన రేవంత్ సర్కార్ మొదట ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. అందులో మొదటి విడతగా రబీ సీజన్లో పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.6 వేలు జమచేయడం ప్రారంభించారు.
అయితే ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకే పెట్టుబడి సాయం అందింది. జనవరి 26న రైతు భరోసా ప్రథకాన్ని ప్రారంభించారు.. అంటే నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేవు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతాంగం గుర్రుగా ఉన్నారు... ఇది గుర్తించిన రేవంత్ సర్కార్ అందరు రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు సిద్దమయ్యింది.
నాలుగు ఎకరాలకు పైగా భూములున్న రైతుల ఖాతాల్లో మే నెలాఖరుకు రైతు భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 10 ఎకరాల లోపు రైతులకు ఈ పెట్టుబడి సాయం డబ్బులు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది... దీంతో త్వరలోనే రైతు భరోసా అందనున్నట్లు జరుగుతున్న ప్రచారం రైతులను ఖుషీ చేస్తోంది.
నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, వ్యవసాయ అధికారులతో సమావేశం కానున్న సీఎం రైతు భరోసాకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పట్లోపు పడతాయన్నదానిపై పూర్తి క్లారిటీ రానుంది.
మరో పది పదిహేను రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. దీంతో రైతులు పంటలు వేసేందకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం అందిస్తే ఆ డబ్బులు రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లే వర్షాకాలం మొదలయ్యేలోపు రైతు భరోసాను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.