రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖకు పంపిన మూడు సెట్ల గెజిట్ కాపీలు సరిచూసి, ఒక సెట్ ఎన్నికల సంఘానికి పంపించగా, మరో సెట్ సీఎస్ రామకృష్ణా రావుకు అందజేశారు.
ఈ రిజర్వేషన్ల గెజిట్ అందడంతో ఎన్నికల ప్రక్రియకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. గతంలో బీసీ రిజర్వేషన్ల అంశం మీద నిలిచిపోయిన ఎన్నికలు ఇప్పుడు తిరిగి వేగంగా మొదలు కానున్నాయి.
హైకోర్టులో కీలక విచారణ: ఎన్నికల పై ప్రభావం
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సాధారణంగా సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో మంగళవారానికి వాయిదా పడింది.
రాష్ట్ర ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ ద్వారా కోర్టుకు నివేదించింది. ఈ విచారణ ఎన్నికల వేగం మీద ప్రభావం చూపే అవకాశముంది కానీ ఇప్పటి వరకు అందిన సంకేతాలు సజావుగా ముందుకు వెళ్లే సూచనలే ఉన్నాయి.