Telangana: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో, బీసీ రిజర్వేషన్ల అమలుపై అనిశ్చితి నెలకొంది.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తెలంగాణ ప్రభుత్వ జీవో నంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేను రద్దు చేయాలని రాష్ట్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కానీ సుప్రీంకోర్టు గురువారం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది.
25
ప్రభుత్వ వాదనలు
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల నిర్ణయం రాష్ట్ర హక్కు పరిధిలోకి వస్తుందని, ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం పకడ్బందీగా సామాజిక–ఆర్థిక–కుల సర్వే నిర్వహించి, 94 వేల మంది సిబ్బందితో డేటా సేకరించిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి, డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు రిజర్వేషన్ శాతం నిర్ణయించామని తెలిపారు. “దేశంలో ఎక్కడా లేని విధంగా సాంకేతికంగా, సమగ్రంగా సర్వే నిర్వహించాం. వెంపరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచడంలో చట్టపరమైన లోపం లేదు.” అని అభిషేక్ సింగ్వి తన వాదనలో తెలిపారు.
35
ప్రతిపక్ష వాదనలు
మాధవరెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలు లేదా గిరిజన ప్రాంతాలు ఉన్నప్పుడు మాత్రమే 50 శాతం దాటే అవకాశం ఉందని, తెలంగాణలో అలాంటి ప్రాంతాలు లేవని తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో కూడా ఇలాంటి ప్రయత్నాలు కోర్టులు నిలిపేశాయని గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు గత తీర్పుల్లో (ఇందిరా సహాని, గౌలి కేసులు) పేర్కొన్న “ట్రిపుల్ టెస్ట్” విధానాన్ని రాష్ట్రం అమలు చేసిందని తెలంగాణ వాదించింది. అంటే – కమిషన్ ద్వారా సర్వే, ఎంపరికల్ డేటా ఆధారం, సహేతుక కారణాలతో నిర్ణయం అనే మూడు దశలు పాటించామన్నది ప్రభుత్వ వైఖరి. కానీ సుప్రీంకోర్టు దానిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయలేదు. హైకోర్టు మధ్యంతర తీర్పులో సరైన కారణాలు లేవని రాష్ట్రం వాదించినప్పటికీ, సుప్రీంకోర్టు ఆ వాదనను అంగీకరించలేదు.
55
ఏం చేయనున్నారు.?
హైకోర్టు స్టే కొనసాగడంతో, బీసీ రిజర్వేషన్ పెంపు తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగబద్ధ మార్గాల ద్వారా మళ్లీ ప్రయత్నించే అవకాశముంది. ఈ తీర్పు తెలంగాణలో రిజర్వేషన్ విధానంపై విస్తృత చర్చకు దారితీస్తోంది. రాజకీయంగా బీసీ వర్గాల మద్దతు పొందాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం చట్టపరమైన అడ్డంకులతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తేల్చిన ఈ తీర్పు, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పరిమితిపై మళ్లీ చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.