సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించగా, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 5246 బస్సులను నడిపింది. ఈ నేపథ్యంలో జనవరి 9 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, అరమ్గఢ్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిచే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు పునరుద్ఘాటించారు.