
Sankranti Holidays 2025: పండుగ సీజన్ రాబోతోంది. కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే సంక్రాంతి పండుగకు సంబంధించి ప్రభుత్వం సెలవుల వివరాలు అధికారికంగా ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ పాఠశాల క్యాలెండర్ ప్రకారం.. జనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సంక్రాంతి దృష్ట్యా ఈ ఐదు రోజుల సెలవులు క్రిస్మస్ సెలవులకు ముందే అనుమతించారు.
అయితే, విద్యార్థులు రెండు రోజుల ముందు నుంచే తమ సంక్రాంతి సెలవులు ఆనందించవచ్చు. ఎందుకంటే 13 నుంచి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులు ప్రకటించింది. దాని ముందు రెండు రోజులు అంటే 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో విద్యార్థులకు ఈ సెలవులు అదనం అని చెప్పవచ్చు.
ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్-IV త్వరలోనే జరగనున్నాయి. ఈ సెలవుల సమయం కూడా విద్యార్థులకు పరీక్షలు ప్రిపేర్ కావడానికి ఉపయోగపడవచ్చు. పదవ తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా పరీక్షలు నిర్వహించాలని పాఠశాలకు ఇప్పటికే ఆదేశాలు అందాయని సమాచారం. అయితే 1 నుండి IX తరగతుల విద్యార్థులు తమ సంబంధిత పరీక్షలను 28 ఫిబ్రవరిలోపు రాయవలసి ఉంటుందని సమాచారం.
ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా తమ సంక్రాంతి సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు, ఇది జనవరి 13 న ప్రారంభం కానున్నది. అయితే, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా సెలవు తేదీలను ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 19 వరకు సంక్రాంతి సెలవులు పాటించనున్నట్లు SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు.
కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా ముందుగా మూసివేసిన కారణంగా సెలవులు జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు పరిమితం చేయబడతాయని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. అధికారిక సెలవుల షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని పునరుద్ఘాటిస్తూ, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కృష్ణా రెడ్డి ప్రజలను కోరారు.
సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించగా, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 5246 బస్సులను నడిపింది. ఈ నేపథ్యంలో జనవరి 9 నుంచి 15 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, అరమ్గఢ్, ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిచే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు పునరుద్ఘాటించారు.