Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Published : Apr 23, 2026, 11:19 AM IST

Telangana Weather : తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.. అయితే ఏప్రిల్ 24 నుండి ఇవి పీక్స్ కు చేరుకుంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు… కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

PREV
16
తెలంగాణ వెదర్ రిపోర్ట్..

Heat Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అన్నిచోట్లా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఈ ఎండలు, వడగాలులు, ఉక్కపోత తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ఈ ఎండలు కేవలం ట్రైలర్ మాత్రమే... అసలుసిసలైన వేసవి సినిమా ముందుంది అనేలా తెలంగాణ వెదర్ మ్యాన్ కీలక ప్రకటన చేశారు. రేపట్నుంచి అంటే ఏప్రిల్ 24 (శుక్రవారం) నుండి భానుడి భగభగలు మరింత పెరుగుతాయంటూ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

26
అగ్నిగుండంలా మారనున్న తెలంగాణ..

తెలంగాణలో ఎండలు మరింత ముదరనున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఏప్రిల్ 24 నుండి 29 వరకు ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని... ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదుకాని అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయని హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు అగ్నిగుండంలా మారే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలంగాణ వెదర్ మ్యాన్ టెంపరేచర్స్ ఆధారంగా మూడు అలర్ట్ జారీ చేశారు. 43-45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్... 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... కాస్త తక్కువగా అంటే 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

36
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలపై సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. రేపట్నుంచి ఈ ఎండలు తారాస్ధాయికి చేరతాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు వెదర్ మ్యాన్. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

46
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్...

తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వెదర్ మ్యాన్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు... అంటే ఇక్కడ 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నమాట. ఇలా కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. ఈ జిల్లాల ప్రజలు ఎండలు, వడగాలుల భారీనుండి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

56
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

రాజధాని హైదరాబాద్ తో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఈ ఎండలు కాస్త ఊరటనివ్వనున్నాయని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉంటాయి... 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

66
ఉదయమే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలా..!

తెలంగాణలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేసే సమాచారాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 23, గురువారం) ఉదయమే ఆదిలాబాద్ లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నిజామాబాద్ లో 41.8, రామగుండంలో 41.2, మెదక్ లో 40.9, ఖమ్మంలో 40.8, మహబూబ్ నగర్ లో 40.6, భద్రాచలంలో 40.6 . నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హకీంపేటలో 39.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories