Rain Alert: వేసవి వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతం ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో రుతుపవనాలు మరింత బలపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పశ్చిమ-మధ్య, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాలను పూర్తిగా కవర్ చేశాయి. అలాగే ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి మరింత వేగంగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో దక్షిణ, మధ్య భారతంలోని మరిన్ని ప్రాంతాలను తాకే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి.
25
తెలంగాణలో వర్షాలకు అనుకూల పరిస్థితులు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, మరో రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర భారతం నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం మారుతోంది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు కనిపించకపోయినా, వర్షాల ప్రభావంతో వేడి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది.
35
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు జల్లుల సూచన
అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, కోస్తా కర్ణాటక నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురుగాలుల వేగం కూడా పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం పరిస్థితులు మరింత అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయ పనులు చేపట్టే రైతులు వాతావరణ సూచనలను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
55
ఎండల తీవ్రత తగ్గే అవకాశాలు
రాబోయే ఐదు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులు లేకపోయినా, వర్షాలు, మేఘావృత పరిస్థితుల కారణంగా ఎండల ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చల్లటి గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలకు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభానికి వాతావరణం క్రమంగా సిద్ధమవుతోంది.