Railway: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. రూ. 770 కోట్ల‌తో ఆ మార్గంలో కొత్త రైల్వే లైన్‌

Published : Jul 08, 2026, 06:25 PM IST

Railway: తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకార‌ప‌డింది. డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) వరకు డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తవడంతో పనులు ప్రారంభానికి మార్గం సుగమమైంది. 

PREV
15
54.43 కిలోమీటర్ల డబుల్ లైన్ నిర్మాణానికి సిద్ధం

ప్రస్తుతం డోర్నకల్-భద్రాచలం రోడ్ మార్గంలో సింగిల్ రైల్వే లైన్ మాత్రమే ఉండటంతో రైళ్ల రాకపోకల్లో తరచూ జాప్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తొలి దశలో 54.43 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.770.12 కోట్లు కాగా, ప్రారంభ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. భూసేకరణ పూర్తవడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

25
355 మంది రైతుల నుంచి భూముల సేకరణ పూర్తి

ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మొత్తం 32.03 ఎకరాల భూమి అవసరమైంది. అధికారులు 355 మంది రైతుల నుంచి అవసరమైన భూమిని విజయవంతంగా సేకరించారు. అదనంగా డోర్నకల్-పుల్లూరు ప్రాంతంలో మరో సుమారు 7.5 ఎకరాల భూమి కూడా సేకరించినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణ పూర్తవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది.

35
భద్రాచలం భక్తులకు మరింత సౌకర్యం.. రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం

డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. సికింద్రాబాద్, విజయవాడ, బలార్షా తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ మార్గంలో పోచారం, కారేపల్లి, గాంధీపురం హాల్ట్, చీమలపహాడ్, తడికలపూడి, బేతంపూడి వంటి స్టేషన్లు ఉండటంతో స్థానిక ప్రజలకు కూడా మెరుగైన రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. సరుకు రవాణా కూడా వేగవంతమై పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది.

45
ఉద్యోగాలు, రైల్వే మౌలిక సదుపాయాలకు ఊతం

ఈ ప్రాజెక్టుతో డోర్నకల్ జంక్షన్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైల్వే యార్డును ఆధునికీకరించడంతో పాటు అదనపు కార్యాలయాలు, కోచ్ ఫిట్ లైన్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉన్నాయి. అలాగే లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, సాంకేతిక సిబ్బంది, పరిపాలనా విభాగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో డోర్నకల్‌లో ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఈ ప్రాజెక్టుతో పెరుగుతాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

55
2008లో ప్రతిపాదన.. ఇప్పుడు కార్యరూపం

డోర్నకల్-మణుగూరు మధ్య మొత్తం 104 కిలోమీటర్ల డబుల్ లైన్ నిర్మాణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం 2008-09 రైల్వే బడ్జెట్‌లోనే ప్రకటించింది. అందులో భాగంగా తొలి దశలో డోర్నకల్-భద్రాచలం రోడ్ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కావడంతో పాటు భక్తులు, ప్రయాణికులు, పరిశ్రమలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories