కల్నల్ సంతోష్ బాబు స్పూర్తితో... దేశ రక్షణలో యువత ముందుండాలి: మంత్రి జగదీష్ రెడ్డి

First Published Nov 8, 2021, 5:09 PM IST

సూర్యాపేట జిల్లా  కేంద్రంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. 

 సూర్యాపేట: దేశ రక్షణలో యువతరం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు కల్నల్ సంతోష్ బాబు ను స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని ఆయన యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు. కల్నల్ సంతోష్ బాబుకు స్ఫూర్తి ఆయన తల్లిదండ్రులేనని... కానీ నేటి యువతీ యువకులకు మాత్రం సంతోష్ బాబు స్ఫూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు.

అర్మీలో సిపాయి నుండి ఉన్నతాధికారి ఎంపికలకు గాను సోమవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వివి కళాశాల క్రీడా మైదానంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. సభా కార్యక్రమాన్ని దివంగత కల్నల్ సంతోష్ బాబు చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు.
 

అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేట కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అనూహ్యమైనదని అన్నారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకుని ఈనాటి ర్యాలీకి తరలివచ్చిన వారందరినీ ఆయన అభినందించారు.
 

ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. అందుకు భిన్నంగా యువత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం, దేశం మనదే అని అనుకున్నపుడు మాత్రమే భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పారు.అటువంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందన్నారు.

సిపాయి ఉద్యోగం నుండి ఉన్నతాధికారి ఎంపిక వరకు ఇకపై సూర్యాపేటలోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. అటువంటి ఉద్యోగాల ఎంపిక కోసం ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీ లో ఎంపికయి రెండు నెలల పాటు శిక్షణ పొందనున్నవారికి శిక్షణాకాలంలో బోజనాది సౌకర్యాలు సొంతంగా భరించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి రాజేంద్రప్రసాద్, ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ కల్నల్ యస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 ఇదిలా ఉండగా సూర్యపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఆర్మీ ప్రీ రిక్రూట్ మెంట్ ర్యాలీ లో పాల్గొన్న వారందరికీ అల్పాహారం అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యక్తిగత అనుచరులకు సూచించారు. ఉదయం నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకులకు అల్పాహారం అందించాలంటూ ఆయన అనుచరులకు సూచించడంతో అప్పటికప్పుడు పట్టణంలోని హోటళ్ల నుండి తెప్పించి అందజేశారు.

మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున యువతీ యువకులు హాజరుకావడం నిర్వాహకులు ముందుగా ఉహించలేకపోయారు. ఆర్మీ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఉండలని పట్టుబట్టి సాధించిన మంత్రి జగదీష్ రెడ్డి సైతం కార్యక్రమానికి వచ్చిన స్పందనతో సంతోషం వ్యక్తం చేశారు. అటువంటి తరుణంలో ఈ  రెండు నెలల శిక్షణా కాలంలో బోజనాది సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. 

click me!