
హైదరాబాద్ నగర విస్తరణ వేగంగా సాగుతోంది. నగర కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు ఇప్పటి వరకు రవాణా సమస్యలతో వెనుకబడ్డాయి. మెట్రో రైలు రెండోదశ విస్తరణ ప్రారంభమైతే ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. మెట్రో స్టేషన్ల చుట్టూ నివాస ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఈ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కొత్తగా అపార్ట్మెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పడే అవకాశం పెరుగుతోంది.
మెట్రో అందుబాటులోకి వస్తే రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. ఆర్థిక భారం తగ్గడంతో గృహ రుణాలను సకాలంలో చెల్లించే సామర్థ్యం పెరుగుతుందని ఇటీవల ఆర్థిక రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన సంకేతం. మెట్రో కారిడార్ల వెంట భూముల విలువ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు పక్కకు నెట్టబడిన ప్రాంతాలు కూడా నివాసయోగ్యంగా మారతాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే అవకాశం ఉంటుంది. నగర శివారుల్లో ఉన్న వారు కూడా ఆఫీసులు, వ్యాపారాలకు నగరంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా వెళ్లే అవకాశం లభిస్తుంది.
రెండోదశలో ‘ఏ’ కేటగిరిలో ఐదు ప్రధాన కారిడార్లను ప్రభుత్వం ప్రతిపాదించింది.
నాగోల్ – ఆరాంఘర్ – శంషాబాద్ విమానాశ్రయం (36.8 కి.మీ.)
రాయదుర్గం – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – కోకాపేట నియోపోలీస్ (11.6 కి.మీ.)
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)
మియాపూర్ – పటాన్ చెరు (13.4 కి.మీ.)
ఎల్బీనగర్ – హయత్ నగర్ (7.1 కి.మీ.)
ఈ మార్గాలన్నీ ఇప్పటికే జనావాసాలు ఉన్న ప్రాంతాలే. మెట్రో కనెక్టివిటీ పెరిగితే అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించే అవకాశముంది. ముఖ్యంగా మియాపూర్, పటాన్ చెరు, హయత్ నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చురుకుదనం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
శంషాబాద్ విమానాశ్రయం – ఓఆర్ ఆర్ – ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ.)
జేబీఎస్ – మేడ్చల్ (24.5 కి.మీ.)
జేబీఎస్ – శామీర్ పేట (22 కి.మీ.)
ఈ మార్గాలు పూర్తైతే పరిశ్రమలు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్లు ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగుల నివాస అవసరాలు పెరగడంతో భూముల ధరలు, ఇళ్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఇప్పుడే పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. శామీర్ పేట, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర అనుమతులు వచ్చి పనులు వేగంగా సాగితే నాలుగు నుంచి ఐదు ఏళ్లలో రెండోదశ మెట్రో పూర్తయ్యే అవకాశం ఉంది. నిత్యం లక్షల మంది ప్రయాణించే స్థాయికి చేరుకుంటే నగరంలో రవాణా ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో మెట్రో స్టేషన్ల చుట్టూ వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దశను తెరుస్తుంది. నగరం ఒకే దిశగా కాకుండా అన్ని వైపులా సమతుల్యంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మెట్రో విస్తరణ హైదరాబాద్ భవిష్యత్ ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచనతో పెట్టుబడి పెట్టడం మంచిది.