
Telangana Cabinet Meeting : సోమవారం తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఇందులో ముఖ్యంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏర్పాటుచేసిన జస్టిస్. పిసి ఘోష్ కమీషన్ నివేదికపైనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నుండి పిసి ఘోష్ నివేదిక సమర్పించేంత వరకు ఏం జరిగిందో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మీడియా ముందే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
మంత్రిమండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులంతా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మొదట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలోనే అతి ముఖ్యమైన అంశంపై కాళేశ్వరం ప్రాజెక్ట్... దీనిపైనే మంత్రిమండలిలో ప్రధాన చర్చ జరిగిందని తెలిపారు. కాళేశ్వరం తెలంగాణకు లైఫ్ లైన్.. అలాంటి ప్రాజెక్టును స్వార్థంతో గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.
తెలంగాణ ప్రజలను మార్ట్ గేజ్ చేసిమరీ రూ.84 వేల కోట్ల అప్పును అత్యధిక వడ్డీతో తెచ్చి కాళేశ్వరం కట్టారని ఉత్తమ్ అన్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం నాణ్యతతో చేపట్టలేదు... అందుకే కొన్నాళ్లకే ఇది కూలిపోయిందన్నారు. లక్షల ఎకరాలకు నీరందిస్తుందని చెప్పిన ప్రాజెక్ట్ ఆరంభంలో ఇలా కుప్పకూలడానికి అవినీతే కారణమన్నారు.
మొదట తుమ్మిడిహట్టి వద్ద రూ.38 వేల కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టును... రూ.11 వేల కోట్లు ఖర్చుచేసాక కేసీఆర్ సర్కార్ కొత్త ప్రాంతానికి తరలించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీన్ని మేడిగడ్డకు మార్చి నాన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ వద్ద అప్పులు తెచ్చారని ఉత్తమ్ తెలిపారు. ఇలా తెలంగాణను అప్పుల్లోకి నెట్టి కట్టిన ప్రాజెక్టు రెండుమూడేళ్లకే కూలడం దారుణమన్నారు.
గత ఎన్నికల హామీ మేరకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలలకే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమీషన్ ఏర్పాటుచేసామన్నారు. కలకత్తా హైకోర్టులో జడ్జిగా, ఏపీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన న్యాయ నిపుణుడు పిసి. ఘోష్... ఆయనతో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కాళేశ్వరంపై విచారణ జరిపినట్లు తెలిపారు.
సిపి ఘోష్ కమీషన్ సుదీర్ఘ విచారణ అనంతరం 31 జులై, 2025 రోజున 660 పేజిల రిపోర్ట్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు అందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీన్ని పరిశీలించేందుకు ముగ్గురు అధికారులలో కమిటీ వేశామని... వాళ్లు నివేదికలోకి ప్రధాన అంశాలతో 20-25 పేజీలు రిపోర్ట్ తయారుచేశారని అన్నారు. దీన్ని కేబినెట్ లో చర్చించామని... అనంతరం పిసి ఘోష్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
2016 ఆగస్ట్ 26 : బిఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకుంది.
21 జూన్ 2019 : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన
21 అక్టోబర్ 2023 : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు
25 అక్టోబర్ 2023 : NDSA (నేషనల్ డ్యాం సెప్టీ అథారిటీ) టీం, ENC(O&M) కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన
01 నవంబర్ 2023 : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమేంటో చెప్నిప NDSA
13 ఫిబ్రవరి 2024 : తెలంగాణ ప్రభుత్వం NDSA చైర్మన్ కు కాళేశ్వరంలోని మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణంపై సమగ్ర పరిశీలించాలని కోరింది.
02 మార్చ్ 2024 : NDSA ఓ కమిటీని ఏర్పాటుచేసింది
07, 08 మార్చ్ 2024 : NDSA కమిటీ కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన
14 మార్చ్ 2024 : తెలంగాణ ప్రభత్వం పిసి ఘోష్ కమీషన్ ను ఏర్పాటుచేసింది.
31 జులై 2025 : పిసి ఘోష్ కమీషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది
2007, 08 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. తుమ్మిడిహట్టి నుండి చేవెళ్లకు నీటిని తీసుకురావాలని భావించారని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటుతర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చింది... మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోయాలని.. అక్కడ నుండి తెలంగాణలోని పలు ప్రాంతాలను నీటిని తరలించే ప్రాజెక్టును రూపొందించిందన్నారు. అయితే నిర్మాణం జరిగిన మూడు సంవత్సరాలలోపే మేడిగడ్డ కుంగింది... అన్నారం, సుందిళ్ల బ్యారేజీకి పగుళ్లు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటీ విచారణలో ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలోపం ఉందని నివేదికలో తెలిపిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక, నీటిపారుదల శాఖ మంత్రిని ప్రభుత్వం ఏర్పాటుచేసిన పిసి ఘోష్ కమీషన్ విచారిందని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కు ముందుగానే నోటిసులు ఇచ్చి విచారణ పిలిచిందన్నారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతి, అక్రమాలకు పాల్పడిన కాళేశ్వరం కూలిందని రేవంత్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో పిసి ఘోష్ నివేదికన శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని... ఆతర్వాతే దీనిపై ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కమిషన్ రిపోర్టును తప్పుపట్టడం సహజమే... నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడటం అలవాటే అన్నారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు…ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ అన్నారు. నివేదిక సారాంశం, అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయి... రాజకీయ కక్షతో చర్యలకు పాల్పడమన్నారు. నివేదికపై అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.