
Thunderstorm Warning : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రోహిణి కార్తె వచ్చేసింది కాబట్టి రోకళ్లు పగిలే స్థాయిలో ఎండలు కొనసాగుతున్నాయి... ఉదయమే సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో మండుటెండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఏకంగా 46-48 డిగ్రీల అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మధ్యాహ్నమంతా ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు సాయంత్రం చల్లని వర్షాలు ఉపశమనం కల్పిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి... ఎండలతీవ్రత ఇలా తగ్గగానే అలా ఆకాశంలో మేఘాలు కమ్మేస్తున్నాయి... వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఇలా తెలుగు ప్రజలకు ఎండలనుండి ఉపశమనం లభిస్తోంది.
అయితే రాబోయే 48 గంటల్లో (మే 26, 27 తేదీల్లో) తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... ఇలా 50 నుండి 60 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 20 నుండి 30 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
ఇవాళ, రేపు (మంగళ, బుధవారం) హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నగరంలో కొన్నిచోట్ల 40 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారతాయి... కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.
ఓవైపు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూనే మరోవైపు ఎండలు కూడా మండిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఈ రెండ్రోజులూ మధ్యాహ్నం సమయంలో ఎండలు.. సాయంత్రం సమయంలో వానలు ఉంటాయట. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షతీవ్రత తక్కువగా ఉంటుంది.. ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. అత్యధికంగా 43 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయట... హైదరాబాద్ లో 40 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండావాన పరిస్థితి ఉంటుందట. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కొన్నిచోట్ల గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయి.. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని APSDMA హెచ్చరించింది. కాబట్టి ప్రజలు వర్షం కురిసే సమయంలో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని… సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
ఓవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ శనివారం (మే 30 వరకు) వరకు ఏపీలో ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయంటే..
45°C - 46°C : ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం.
42°C - 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు.
40°C - 42°C : శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాలు.
26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.