HCU Land Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పక్కనే ఉన్న కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదం మరింత ముదిరి సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలోనే అక్కడ వెంటనే చెట్లు నరకడం లేదా ఇతర పనులు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. తెలంగాణ సీఎస్ తమ ఆదేశాలు అమలుచేయకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే, చదును చేసే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాలని కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దనీ, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారించింది. అలాగే, వివాదానికి కేంద్రంగా మారిన భూములకు వెళ్లి మధ్యంతర నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను కూడా ఆదేశించింది.
ప్రభుత్వ దూకుడు చర్యలు-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనలు
హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) పక్కనే ఉన్న కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి చుట్టు ఇప్పుడు వివాదం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని వాదిస్తోంది. ఐటీ పార్కుల అభివృద్ధి కోసం ఆ భూములను వేలం వేయాలని ప్లాన్ చేసింది. అందుకే అక్కడనున్న చెట్లను నరికివేస్తూ భూమిని చదును చేయడం మొదలుపెట్టింది.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) భూమిని చదును చేయడం మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో బుల్డోజర్లను మోహరించి చెట్లను నరికివేస్తూ భూమిని చదును చేయడం మొదలు పెట్టారు. ఇది విద్యార్థుల నిరసనలకు దారితీసింది. ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదనీ, ప్రభుత్వ చర్యలతో ఇక్కడ పర్యావరణం దెబ్బతింటోందని నిరసనలు చేస్తున్నారు. పర్యావరణ కార్యకర్తలు, విద్యార్థులు ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు.
400 ఎకరాల భూములపై ప్రభుత్వం ఏం చెబుతోంది?
తెలంగాణ సర్కారు 400 ఎకరాల భూములు ప్రభుత్వానికి చెందినవనీ, 2004లో క్రీడా మౌలిక సదుపాయాల కోసం IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు మొదట కేటాయించిన విషయాలు ప్రస్తావిస్తోంది. కంపెనీ భూమిని అభివృద్ధి చేయడంలో విఫలమైనప్పుడు, కేటాయింపు రద్ చేసినట్టు తెలిపింది. దీంతో తిరిగి భూమిని ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. మే 2024లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రభుత్వం యాజమాన్యాన్ని పొందింది. రెవెన్యూ రికార్డులలో ఈ భూమిని "కంచ పోరంబోక్" (మేత/వ్యర్థ భూమి)గా వర్గీకరించారనీ, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉద్దేశించిదని వాదిస్తోంది.
హైదరాబాద్ యూనివర్సిటీ, పర్యావరణవేత్తల ఆందోళనలు
హైదరాబాద్ విశ్వవిద్యాలయం 1975లో మొదట కేటాయించిన 2,324 ఎకరాల్లో 400 ఎకరాలు భాగమనీ, భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యల కారణంగా అక్కడి పర్యావరణం దెబ్బతింటున్నదనీ, అక్కడి జంతుజాలం ప్రభావితమవుతుందని HCU విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ ప్రాంతంలోని పర్యావరణ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నారు. నెమళ్ళు, జింకలు, అడవి పందులు, వివిధ పక్షి జాతులు వంటి విభిన్న వృక్షజాలం, జంతుజాలం ఇక్కడ ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే, దీనిని హైదరాబాద్కు గ్రీన్ లంగ్స్ గా కూడా ఉందని వాదనలు చేస్తున్నారు.
HCU Land Dispute మొత్తంగా ఇప్పటివరకు ఏం జరిగింది?
మార్చి చివరివారంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) భూమిని చదును చేయడానికి బుల్డోజర్లను మోహరించింది. ఇది విద్యార్థుల నిరసనలకు దారితీసింది.ఈ పనులను అడ్డుకున్నందుకు 50 మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 4 వరకు జరిగిన విషయాలు గమనిస్తే.. చెట్లు నరుకుతూ భూమిని చదును చేయడం వంటి కార్యకలాపాలను నిలిపివేయాలనీ, విశ్వవిద్యాలయం పేరుతో భూమిని అధికారికంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ HCU విద్యార్థులు నిరసనలకు దిగారు. ఏప్రిల్ 2 పర్యావరణ సంస్థలు, పర్యావరణ కార్యకర్తలు వేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపి ఏప్రిల్ 3న తదుపరి విచారణ జరిగే వరకు 400 ఎకరాల్లోని అన్ని పనులు ఆపాలని ఆదేశించింది.
400 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని చెట్ల నరికివేత, తవ్వకాలు, భూమిని చదును చేసే కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) కూడా స్థలాన్ని పరిశీలించి, అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలలోపు నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాథమిక నివేదిక, ఫోటోలను గమనించి చెట్ల నరికివేతపై ఆందోళన వ్యక్తం చేసింది. మూడో రోజుల్లోనే వందల ఎకరాల్లో చెట్లను నిరికివేయడమేంటని ప్రశ్నించింది.
అడవుల పెంపకం లేకుండా రాష్ట్రాలు అటవీ ప్రాంతాలను తగ్గించకుండా నిరోధించే దాని మునుపటి ఆదేశాలను, అటవీ భూములను గుర్తించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంలో జాప్యాలను ఎత్తిచూపుతూ ప్రధాన కార్యదర్శులను వ్యక్తిగతంగా బాధ్యులుగా చేస్తూ మరొక ఉత్తర్వును కోర్టు ప్రస్తావించింది.