
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్లో క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభించనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికరమైన మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
మొత్తం 5 జట్ల మధ్య 28 రోజుల పాటు జరగనున్న ఈ క్రికెట్ పండుగలో మొత్తం 22 మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత, వడోదరలో ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, అలాగే ఫిబ్రవరి 5న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈసారి టోర్నమెంట్ రెండు ప్రధాన స్టేడియాల్లో జరగనుండగా, కొత్త సీజన్కు ముందు ఐదు జట్లలో రెండు జట్లు తమ కెప్టెన్లను మార్చడం విశేషం.
WPL సీజన్-4కు సంబంధించిన ఫార్మాట్, జట్లు, నిబంధనలు, ఇతర ఆసక్తికర విషయాలను గమనిస్తే..
డబ్ల్యూపీఎల్ సీజన్-4 ఎప్పటిలాగే లీగ్ ఫార్మాట్లో జరగనుంది. టోర్నమెంట్లో పాల్గొంటున్న ఐదు జట్లు ప్రతి ఇతర జట్టుతో రెండేసి మ్యాచ్లు ఆడతాయి. అంటే ఒక్కో జట్టు లీగ్ దశలో మొత్తం 8 మ్యాచ్లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది.
ఇక 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో అంటే 4, 5 ప్లేస్ లలో నిలిచిన జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తాయి.
ఈసారి టోర్నమెంట్ నాలుగు గ్రౌండ్ లకు బదులుగా కేవలం రెండు ప్లేస్ లలోనే జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మొదటి 11 మ్యాచ్లు, వడోదరలోని కోటాంబి స్టేడియంలో చివరి 11 మ్యాచ్లు జరగనున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్లు (ఎలిమినేటర్, ఫైనల్) రెండూ వడోదరలోనే జరుగుతాయి.
ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే, ముంబై, గుజరాత్, బెంగళూరు జట్లు తమ పాత కెప్టెన్లనే కొనసాగించగా, ఢిల్లీ, యూపీ జట్లు మాత్రం నాయకత్వ బాధ్యతల్లో మార్పులు చేశాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలను భారత స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ చేపట్టనుంది. ఆశ్చర్యకరంగా, గతంలో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహరించి, ఆ జట్టును మూడు సీజన్ల పాటు ఫైనల్స్కు చేర్చిన మెగ్ లానింగ్, ఈసారి యూపీ వారియర్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుంది.
ప్రతి జట్టు తమ ప్లేయింగ్-11లో గరిష్ఠంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలి. మిగిలిన 7 మంది కచ్చితంగా భారతీయ క్రీడాకారిణులే ఉండాలి. ఒకవేళ అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్ను తుది జట్టులో తీసుకుంటే, అప్పుడు 5 మంది విదేశీ ఆటగాళ్లను ఆడించే వెసులుబాటు ఉంటుంది.
అయితే, ఈసారి వేలంలో అమ్ముడైన ఏకైక అసోసియేట్ ప్లేయర్, అమెరికాకు చెందిన తారా నోరిస్, టీ-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ కారణంగా ఈ టోర్నమెంట్కు దూరమయ్యారు. దీంతో ఈసారి 5 మంది విదేశీ ప్లేయర్ల రూల్ ఉపయోగపడకపోవచ్చు.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో గత మూడు సీజన్లలో ఎప్పుడూ ఒకే రోజు రెండు మ్యాచ్లు (డబుల్ హెడర్) జరగలేదు. కానీ, ఈ సీజన్ షెడ్యూల్లో రెండు డబుల్ హెడర్లను చేర్చారు. ఇవి రెండూ శనివారాల్లో (జనవరి 10, జనవరి 17) డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. డబుల్ హెడర్ రోజున మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఐపీఎల్లో ఉన్నట్లుగా డబ్ల్యూపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన లేదు. కాబట్టి ఈ టోర్నీలో దాని వినియోగం ఉండదు. ఇక ప్రైజ్ మనీ విషయానికొస్తే, గత మూడు సీజన్ల లాగానే ఈసారి కూడా విజేత జట్టుకు రూ. 6 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ. 3 కోట్లు దక్కుతాయి.
ఇవి కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలకు కూడా అవార్డులు ఉన్నాయి. టోర్నమెంట్లో బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్, బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్కు తలా రూ. 5 లక్షల చొప్పున అందజేస్తారు. ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన వారికి రూ. 2.50 లక్షలు, మిగిలిన లీగ్ మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కు రూ. 1 లక్ష చొప్పున బహుమతి లభిస్తుంది.
ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఈ జట్టు మూడు సీజన్లలో ప్లే ఆఫ్కు చేరడమే కాకుండా రెండుసార్లు టైటిల్ను గెలుచుకుంది. 2024లో బెంగళూరు టైటిల్ గెలవగా, ఢిల్లీ మూడుసార్లు రన్నరప్గా నిలిచింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై, 2024 ఛాంపియన్ బెంగళూరు, ఢిల్లీ జట్లు ఈసారి కూడా టైటిల్ రేసులో ముందంజలో ఉన్నాయి. వేలంలో ఎక్కువ నిధులు ఉన్నప్పటికీ, యూపీ, గుజరాత్ జట్లు బలమైన జట్లను నిర్మించడంలో కాస్త వెనుకబడ్డాయి.
ఈ మ్యాచ్ల లైవ్ టెలికాస్ట్ స్టార్ నెట్వర్క్లో ప్రసారం అవుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ జియో హాట్స్టార్ (JioHotstar) యాప్లో అందుబాటులో ఉంటుంది. రాత్రి మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి, టాస్ రాత్రి 7 గంటలకు వేస్తారు.