
అడిలైడ్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 264/9 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ (97 బంతుల్లో 73 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (77 బంతుల్లో 61 పరుగులు) జట్టు ఇన్నింగ్స్కు బలం చేకూర్చారు. ఈ జంట 100 పరుగుల భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును నిలబెట్టారు.
మిడిల్ ఓవర్లలో వికెట్లు పడిపోతున్న సమయంలో అక్షర్ పటేల్ (44 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లు పరుగులు చేయడంతో భారత్ స్కోరు 260 దాటింది. హర్షిత్ రాణా 47వ ఓవర్లో ఆడమ్ జాంపా బౌలింగ్ లో మూడు బౌండరీలు సాధించగా, అర్షదీప్ సింగ్ స్టార్క్ బౌలింగ్ లో రెండు బౌండరీలు కొట్టి జట్టు స్కోరును 264 వరకు చేర్చారు.
ఆస్ట్రేలియా బౌలర్లు పెద్దగా పరుగులు రాకుండా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఆడమ్ జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు (4/60) తీసి భారత్ ను దెబ్బకొట్టాడు. అతను అయ్యర్, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, కేఎల్ రాహుల్లను పెవిలియన్ కు పంపాడు. మిచెల్ స్టార్క్ రెండు కీలక వికెట్లు సాధించాడు. జేవియర్ బార్ట్లెట్ పవర్ప్లేలో గిల్, విరాట్ కోహ్లీని ఒకే ఓవర్లో ఔట్ చేసి భారత్పై ఒత్తిడి తెచ్చాడు. కోహ్లీ వరుసగా రెండో వన్డేలో డక్గా వెనుదిరిగాడు, ఇది అతనికి కెరీర్లో మొదటిసారి జరిగింది.
265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో నెమ్మదిగా ఆడింది. మిచెల్ మార్ష్ కెప్టెన్గా బరిలోకి దిగినా తొందరగా 11 పరుగులకే అర్షదీప్ బౌలింగ్లో అవుటయ్యాడు. కానీ మాథ్యూ షార్ట్ (78 బంతుల్లో 74 పరుగులు), కూపర్ కొన్నోలీ (నాటౌట్ 61 పరుగులు ) ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించారు.
షార్ట్, రెన్షా జోడీ 55 పరుగుల భాగస్వామ్యంతో భారత్పై ఒత్తిడి పెంచింది. అక్షర్ పటేల్ రెన్షాను ఔట్ చేసి భారత జట్టుకు ఊరటనిచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అలెక్స్ క్యారీని 9 పరుగులకే ఔట్ చేశాడు. తర్వాత హర్షిత్ రాణా మాథ్యూ షార్ట్ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 187/5 పరుగుల వద్ద కష్టాల్లో పడినట్టు కనిపించింది.
అయితే, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్ 34 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను మళ్లీ నిలబెట్టారు. చివరలో మూడు వికెట్లు 14 పరుగుల వ్యవధిలో కోల్పోయినా ఆస్ట్రేలియా ఈజీగానే లక్ష్యాన్ని చేరుకుంది. అర్షదీప్ సింగ్ వేసిన వైడ్ బంతితో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 265/8 చేసి 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆడమ్ జాంపా అద్భుత బౌలింగ్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా తరఫున జేవియర్ బార్ట్లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా సమర్థవంతమైన బౌలింగ్తో భారత ప్లేయర్ల పై జోరు కొనసాగించారు.
కొత్త కెప్టెన్గా శుభ్ మన్ గిల్కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా మారింది. బ్యాటింగ్లో విఫలమైన అతను కెప్టెన్గా క్రమశిక్షణ చూపించినా జట్టు సమష్టిగా మెరుగ్గా రాణించలేకపోయింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్ చివరి వన్డేను గెలుపుతో ముగించాలని చూస్తోంది. మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది.
కెప్టెన్ శుభ్ మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0) త్వరగా ఔట్ కావడంతో జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మంచి భాగస్వామ్యం ఇచ్చినా మిగతా బ్యాట్స్మెన్లు ఆ స్థాయిలో రాణించలేదు.
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా (4/60) భారత ఇన్నింగ్స్ను దెబ్బకొట్టాడు. అతను ఒకే ఓవర్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్లను ఔట్ చేయడంతో మిడిల్ ఆర్డర్ కూలిపోయింది.
భారత్ మంచి స్థితిలో ఉండగా మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక్క పెద్ద భాగస్వామ్యమూ రాలేదు. దీంతో స్కోరింగ్ రేట్ తగ్గి, భారీ స్కోర్ అవకాశం కోల్పోయింది.
మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ ఆరంభంలో మంచి బౌలింగ్ చేసినా, తరువాత ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి కొనసాగించలేకపోయారు. కూపర్, మాథ్యూ షార్ట్ భాగస్వామ్యం గేమ్ను ఆస్ట్రేలియా వైపు తిప్పింది.
కొన్ని కీలక క్యాచ్లు విడిచిపెట్టారు. ఫీల్డింగ్ ప్లేస్మెంట్లోనూ తప్పిదాలు చోటుచేసుకున్నాయి. బౌలింగ్ మార్పులు సమయానికి రాకపోవడం కూడా భారత జట్టు ఓటమికి కారణమైంది.