T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో దాయాదుల పోరు జరగనుంది.
క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ను, స్టేడియంలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో చోటు దక్కించుకోవడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఈ రెండు దాయాది జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది.
25
ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు
ఈ ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఓమన్; గ్రూప్ సీలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ; గ్రూప్ డీలో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, కెనడా, యూఏఈ జట్లు ఉన్నాయి.
35
వరల్డ్ కప్ ప్రయాణం ఇలా..
భారత్ తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న ముంబైలో యూఎస్ఏతో జరిగే మ్యాచ్తో ప్రారంభించనుంది. అదే రోజున పాకిస్తాన్ నెదర్లాండ్స్తో, వెస్టిండీస్ బంగ్లాదేశ్తో కోల్కతాలో తలపడతాయి. భారత్ తన రెండో మ్యాచ్ను నమీబియాతో ఢిల్లీలో ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్తాన్తో కీలక మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 18న అహ్మదాబాద్లో నెదర్లాండ్స్తో టీమిండియా తలపడుతుంది.
పాకిస్తాన్ జట్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఆ జట్టు తన అన్ని మ్యాచులను శ్రీలంకలోనే ఆడనుంది. సెమీస్ చేరినా లేదా ఫైనల్ చేరినా పాకిస్తాన్ మ్యాచులు శ్రీలంకలోనే జరుగుతాయి. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ చేరకపోతే, మార్చి 8న అహ్మదాబాద్లో టైటిల్ పోరు జరగనుంది. ఈ టోర్నీకి భారత్లో ఐదు నగరాలు – అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై – ఆతిథ్యం ఇవ్వనుండగా, శ్రీలంకలో మూడు నగరాల్లో ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతుంది.
55
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
ఈ టీ20 వరల్డ్ కప్ 2026కు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. రోహిత్ తన వరల్డ్ కప్ జర్నీని గుర్తు చేసుకున్నారు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో సౌతాఫ్రికాపై 50 పరుగులు, ఫైనల్లో పాకిస్తాన్పై 30 పరుగులతో నాటౌట్గా నిలిచి అద్భుతంగా రాణించాడు.