T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. వర్షం పడి మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? ఐసీసీ ఇలాంటి పరిస్థితుల కోసం తీసుకొచ్చిన రూల్స్ ఏంటి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అహ్మదాబాద్లో టీ20 ఫైనల్.. వర్షం పడితే భారత్కు ట్రోఫీ వస్తుందా? ఐసీసీ క్లారిటీ!
క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8న) సాయంత్రం 7:00 గంటలకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి మూడోసారి పొట్టి ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్గా నిలవాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది. అయితే, కీలకమైన ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంటే పరిస్థితి ఏంటి? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
26
భారత్ మూడోసారి.. కివీస్ తొలిసారి
టీమ్ ఇండియా ఇప్పటికే రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో రెండోసారి టైటిల్ సాధించింది. ఇప్పుడు 2026లో మరోసారి ఫైనల్కు చేరి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ జట్టుకు ఇది అత్యంత కీలకం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవని కివీస్, తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. సెమీఫైనల్స్లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించగా, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్కు అర్హత సాధించాయి.
36
IND vs NZ ఫైనల్ కు వర్షం అడ్డుపడితే ఏమవుతుంది?
ఫైనల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే ఏం చేయాలనే దానిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఆదివారం మ్యాచ్ సమయంలో వర్షం పడితే, ఫలితం తేలడానికి రెండు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ టీ20 మ్యాచ్లలో 5 ఓవర్లు సరిపోతాయి, కానీ వరల్డ్ కప్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ల కోసం ఐసీసీ 10 ఓవర్ల నిబంధనను పెట్టింది. ఒకవేళ ఆదివారం వర్షం కారణంగా ఈ కనీస ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే, మ్యాచ్ను రిజర్వ్ డేకి మారుస్తారు.
మార్చి 8న మ్యాచ్ పూర్తి కాకపోతే, మరుసటి రోజు అంటే మార్చి 9న సోమవారం రిజర్వ్ డేగా ప్రకటించారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోతుందో, సోమవారం అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఆదివారం భారత్ 12 ఓవర్లు ఆడిన తర్వాత వర్షం పడి ఆట నిలిచిపోతే, సోమవారం మళ్ళీ మొదటి నుంచి కాకుండా 12.1 ఓవర్ నుంచే ఆట కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం తగ్గకపోయినా లేదా ఆట సాధ్యం కాకపోయినా ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
56
ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి?
ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా ఫలితం తేలకుండా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లను జాయింట్ విన్నర్స్ గా ప్రకటిస్తారు. అంటే రెండు జట్లు ప్రపంచకప్ ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది. అయితే, అహ్మదాబాద్ వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం ఆదివారం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుతుందని అంచనా.
66
న్యూజిలాండ్తో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయి?
హిస్టరీని పరిశీలిస్తే టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్పై భారత్కు చేదు అనుభవాలే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు 3 సార్లు తలపడగా, మూడుసార్లూ కివీస్ జట్టే విజయం సాధించింది. ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ ఎప్పుడూ భారత్కు గట్టి పోటీనిస్తూనే ఉంది. అయితే, ఓవరాల్ టీ20 రికార్డుల్లో భారత్దే పైచేయి. ఇప్పటివరకు ఈ రెండు దేశాల మధ్య 30 టీ20 మ్యాచ్లు జరగగా, భారత్ 18 మ్యాచ్లలో విజయం సాధించింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్లు గెలవగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గణాంకాలను చూస్తుంటే ఫైనల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.