Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో వీరవిహారం చేశారు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టి భారత్కు విజయాన్ని అందించాడు.
టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ సంచలనం.. కోహ్లీ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్తో చెలరేగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఒంటరి పోరాటం చేస్తూ అజేయంగా 84 పరుగులు సాధించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించడమే కాకుండా, బాబర్ ఆజం పేరిట ఉన్న మరో అరుదైన రికార్డును కూడా కనుమరుగు చేశారు.
26
టాస్ ఓడి కష్టాల్లో భారత్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా జట్టు భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే వాంఖడే పిచ్పై భారత బ్యాటర్లు ఆరంభంలోనే తీవ్రంగా తడబడ్డారు. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ (సున్నా) అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాసేపు క్రీజులో ఉన్నా భారీ స్కోర్లు చేయలేకపోయారు. శివం దూబే (0), రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) ఘోరంగా విఫలమవడంతో భారత్ ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
36
ఆపద్భాందవుడు సూర్య.. వీరవిహారం
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. మైదానం నలుమూలలా తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడ్డారు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. చివరి రెండు ఓవర్లలోనే సూర్య 34 పరుగులు రాబట్టడం విశేషం. సౌత్ ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో భారత్ను దెబ్బకొట్టినప్పటికీ, సూర్య పోరాటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేయగలిగింది.
ఈ ఇన్నింగ్స్తో సూర్యకుమార్ యాదవ్ ఒక ఎలైట్ లిస్టులో చేరారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో విరాట్ కోహ్లీని సూర్య వెనక్కి నెట్టారు. గతంలో కెప్టెన్గా కోహ్లీ చేసిన అత్యధిక స్కోరు 57 పరుగులు. ఇప్పుడు 84 పరుగులతో సూర్య రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 92 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సూర్య కేవలం కొద్ది పరుగుల తేడాతో రోహిత్ రికార్డును మిస్ అయ్యారు.
56
బాబర్ ఆజంపై పైచేయి.. గేల్ తర్వాత సూర్యనే
టీ20 ప్రపంచకప్లో కెప్టెన్గా అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజంను సూర్య అధిగమించారు. 2021లో భారత్పై బాబర్ కెప్టెన్గా 68 పరుగులు చేయగా, సూర్య ఇప్పుడు 84 పరుగులు సాధించి రెండో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 88 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు.
కెప్టెన్గా అరంగేట్ర ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లు వీరే
1. క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 88 పరుగులు (2009)
2. సూర్యకుమార్ యాదవ్ (భారత్) - 84 పరుగులు (2026)
3. బాబర్ ఆజం (పాకిస్థాన్) - 68 పరుగులు (2021)
66
కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయికి చేరిన సూర్యకుమార్ యాదవ్
ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్గా ఆయన చరిత్ర సృష్టించారు. అంతకుముందు రోహిత్ శర్మ (1905), విరాట్ కోహ్లీ (1570), ఎంఎస్ ధోని (1112) మాత్రమే ఈ క్లబ్లో ఉన్నారు. కేవలం 41 ఇన్నింగ్స్ల్లోనే సూర్య ఈ ఘనత సాధించడం ఆయన నిలకడకు నిదర్శనం. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, సూర్య తనదైన శైలిలో రాణించి భారత్కు విజయాన్ని అందించడంలో కీలక నాక్ ఆడాడు.