
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగింపు దశకు చేరుకుంది... లీగ్ మ్యాచులు ముగిసి కీలకమైన ప్లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్ 1 లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఇక ఇవాళ (మే 27, బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో విజయం సాధించిన జట్టే క్వాలిఫయర్ 2 ఆడుతుంది... ఓడిన జట్టు ఐపిఎల్ నుండి నిష్క్రమిస్తుంది.
ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ లీగ్ మ్యాచ్ లు ఒకెత్తు... ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్ మరో ఎత్తు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది... సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇరుజట్ల బలాబలాలు చూసినా సన్ రైజర్స్ దే పైచేయిగా కనిపిస్తోంది. మరి ఈ కీలక పోరులో రాజస్థాన్పై హైదరాబాద్ విజయం సాధించడానికి ప్రధానంగా కనిపిస్తున్న 5 కారణాలు ఇవే...
ఐపిఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ సాధించిన విజయాల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా హైదరాబాద్ పులిగా పిలుచుకునే అభిషేక్ శర్మ తన ట్రేడ్మార్క్ హిట్టింగ్తో 560కి పైగా పరుగులు సాధించాడు. ఇక ట్రావిస్ హెడ్ కూడా 168 స్ట్రైక్ రేట్ తో 393 పరుగులు చేశాడు... ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లే మొత్తం ఆడితే సెంచరీ భాగస్వామ్యం ఖాయం.. ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో అభిషేక్, హెడ్ ఇద్దర్లో ఏ ఒక్కరు ఆడినా రాజస్థాన్ బౌలర్లకు హెడేక్ తప్పదు... పరుగుల వరద పారడం ఖాయం.
కేవలం ఓపెనర్లే కాదు సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ కూడా మంచి ఫామ్ లో ఉంది. హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ అందరూ ఈ ఐపిఎల్ హయ్యెస్ట్ రన్స్ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ లు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచులాడిన క్లాసేన్ 606 పరుగులు చేశాడు... ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్నవారిలో క్లాసేన్ మూడోస్థానంలో ఉన్నాడు.
క్లాసెన్, స్పిన్, పేస్ రెండింటినీ సమర్ధవంతంగా ఎదుర్కోగలడు. డెత్ ఓవర్లలో అతడి బ్యాటింగ్ అద్భుతం… అతడి మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, జడేజా వంటివారిని ఎదుర్కోవడంలో క్లాసెన్ పాత్ర అత్యంత కీలకం కానుంది.
కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతమైన వ్యూహాలతో జట్టును ప్లేఆఫ్స్ వరకు నడిపించాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని ఎలా జయించాలో కమిన్స్కు బాగా తెలుసు. ఫీల్డింగ్ సెటప్ నుంచి బౌలింగ్ మార్పుల వరకు అతను తీసుకునే నిర్ణయాలు గత కొన్ని మ్యాచ్ల్లో సత్ఫలితాలను ఇచ్చాయి. అతని అనుభవం ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్కు పెద్ద ప్లస్ పాయింట్.
హైదరాబాద్ బౌలింగ్ గతంలో కంటే ఇప్పుడు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఇషన్ మలింగ, షాకిబ్ హుస్సేన్ వికెట్ల వేటలో దూసుకుపోతున్నారు. మలింగ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తుండగా, హుస్సేన్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్లో ఉన్న యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వంటి కీలక ఆటగాళ్లను త్వరగా పెవిలియన్ చేర్చగల సామర్థ్యం వీరి సొంతం.
మలింగ ఇప్పటివరకు 14 మ్యాచులాడి 19 వికెట్లు పడగొట్టాడు... పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. అలాగే హుస్సెన్ కేవలం 10 మ్యాచుల్లోనే 15 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు కెప్టెన్ కమ్మిన్స్, నితీష్ కుమార్ రెడ్డి వంటివారు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇలా కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ విభాగంలోనూ సన్ రైజర్స్ ఫుల్ ఫామ్ లో ఉంది… వీళ్ళు చెలరేగితే ఆర్ఆర్ ఐపిఎల్ ట్రోఫీ ఆశలు గల్లంతే.
లీగ్ దశ చివరి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏకంగా 255 పరుగులు సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం హైదరాబాద్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటర్లందరూ ఫామ్లో ఉండటం, జట్టులో సమన్వయం పెరగడం వల్ల రాజస్థాన్ను ఓడించడం సన్రైజర్స్కు కష్టమేమీ కాదు.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్న ఫామ్, ప్లానింగ్ చూస్తుంటే వారు క్వాలిఫైయర్-2కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ లలో ఏ టీం ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించి క్వాలిఫయర్ 2 కు చేరుకుంటుందో చూద్దాం…