Published : Apr 21, 2026, 05:39 PM ISTUpdated : Apr 21, 2026, 05:46 PM IST
హైదరాబాద్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ఏమైనా ఆటంకం కలిగిస్తుందా..? వాతావరణ శాఖ ఏం చెబుతోంది…?
Indian Premier League 2026 : తెలంగాణలో కురుస్తున్న వర్షాలు క్రికెట్ ప్రియులకు కంగారుపెడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ లు జరుగుతుండటమే వారి ఆందోళనకు కారణం. ఈ వర్షాల కారణంగా ఎక్కడ మ్యాచ్ లకు ఆటంకం కలుగుతుందో అనేదే అభిమానుల ఆందోళన.
అయితే తాజాగా ఇవాళ (ఏప్రిల్ 21, మంగళవారం) ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించేందుకు వేలాదిమంది... టీవీలు, ఫోన్లలో చూసేందుకు లక్షలాదిమంది సిద్దమయ్యారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ చేసిన ప్రకటన అభిమానుల ఆందోళనకు కారణమవుతోంది.
24
హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్...
కొద్దిరోజులుగా హైదరాబాద్ లో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి... అంటే మధ్యాహ్నమంతా మండుటెండలు ఉంటున్నాయి... సాయంత్రం అయ్యిందంటే ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడుతోంది. కొన్నిసార్లు వర్షాలు కూడా కురుస్తున్నాయి... ఈ ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది.
ఇలా ఇవాళ (మంగళవారం) కూడా హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండుమూడు గంటల్లో వర్షం కురుస్తుందంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది.
ఇప్పటికే నగరంలో పలుచోట్ల ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి... వర్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ ఈ మేఘాలు ఉప్పల్ స్టేడియంకు చేరి మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తుందోనని అభిమానులు కంగారుపడిపోతున్నారు. మరి వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ మాత్రం అభిమానులకు ఊరటనిచ్చే వార్త చెబుతున్నారు.
34
ఉప్పల్ లో వర్షం కురుస్తుందా..?
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాల ప్రకారం... ఈ సాయంత్రం హైదరాబాద్ లో కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయి. అయితే ఈ వర్షాలు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ఉండకపోవచ్చని... అంటే సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు ఎలాంటి ఆటంకం కలిగించకపోవచ్చని అంటున్నారు. ఇది క్రికెట్ ప్రియులకు ఊరటనిచ్చే సమాచారం.
సాధారణంగా ఐపిఎల్ మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం మొదలైతే కొద్దిసేపు వేచిచూస్తారు. నిర్ణీత సమయం అంటే దాదాపు గంటసేపు వర్షం తగ్గుతుందేమో చూస్తారు. గంటలోపు తగ్గితే ఓవర్లను కుదించకుండానే మ్యాచ్ కొనసాగిస్తారు. వర్షం గంటకంటే ఎక్కువసేపు మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తే ఓవర్లను కుదిస్తారు... రెండో ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడితే డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించి ఫలితం తేలుస్తారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం నేపథ్యంలో పైన పేర్కొన్న వాటిలో ఏదైనా జరగవచ్చు. ఒకవేళ భారీ వర్షం కురిసి మైదానం ఆటకు అనుకూలించకపోతే రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే జరిగితే హైదరాబాద్,డిల్లీ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.