
భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్, ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. ముంబైలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రధాన కార్యాలయంలో శనివారం (డిసెంబర్ 20) కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ పాల్గొననుంది. జట్టు ఎంపిక తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో బిజీగా ఉంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైకి చేరుకుని సెలక్షన్ మీటింగ్లో పాల్గొంటారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు ఇదే చివరి దశ సన్నాహకంగా భావిస్తున్నారు.
జనవరి 11 నుండి న్యూజిలాండ్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు సూర్యకుమార్ సేన సన్నద్ధమవుతోంది.
జట్టులోని చాలా స్థానాలపై స్పష్టత ఉన్నప్పటికీ, కొన్ని కీలక స్థానాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఆసియా కప్ సమయంలో వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్, పొట్టి ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్ మిడిల్ ఆర్డర్కు డీమోట్ కావడం లేదా తుది జట్టు నుంచి పూర్తిగా అవుట్ అవుతున్నాడు.
మరోవైపు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ కూడా ఓపెనింగ్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నాడు. సంజూ శాంసన్ కూడా ఓపెనర్గా తన సత్తా చాటుతున్నాడు. గిల్ వైస్ కెప్టెన్ కావడంతో అతడిని పక్కన పెట్టే సాహసం చేస్తారా అనేది చూడాలి. అయితే సంజూ స్థానంలో ఇషాన్ కిషన్ను తీసుకుంటే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ సమస్య తలెత్తవచ్చు.
వికెట్ కీపర్ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ రేసులో ఉన్నారు. సంజూ, ఇషాన్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడగా, జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్ ఫినిషర్గా ఉపయోగపడతాడు. వీరిలో ఎవరికి ప్రపంచ కప్ బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గాయం కారణంగా లక్నోలో జరిగిన 4వ టీ20కి దూరమైన గిల్, న్యూజిలాండ్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా అనేది కూడా సెలెక్టర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు.
మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచ కప్ జట్టుపై తన అంచనాలను వెల్లడించారు. గిల్ వైస్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తం చేసిన చోప్రా, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, గిల్ను ఓపెనర్గా జట్టులో కొనసాగించారు.
ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి వారు ఉన్నారు. సంజూ శాంసన్ను బ్యాకప్ ఓపెనర్, రెండో వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. శనివారం జరగబోయే సమావేశంలో అజిత్ అగార్కర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.