Ravindra Jadeja : న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో రవీంద్ర జడేజా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఇండోర్లో జరిగే నిర్ణయాత్మక మూడో వన్డే జడేజా భవిష్యత్తుకు ఎంతో కీలకం కానుంది. అక్షర్ ఎంట్రీతో సీన్ సితార్ అవుతుందనే చర్చ సాగుతోంది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు సిరీస్ నిర్ణయాత్మక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇండోర్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కేవలం సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా, భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్ను కూడా మలుపు తిప్పే అవకాశం ఉంది.
జడేజా ప్రస్తుత ఫామ్ జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను కలవరపెడుతోంది. న్యూజిలాండ్తో జరిగిన గత రెండు మ్యాచ్లలోనూ జడేజా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో ఇండోర్ వన్డే అతడికి అత్యంత కీలకంగా మారింది.
25
అక్షర్ పటేల్ రెడీ.. జడేజాకు పొంచి ఉన్న గండం
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా న్యూజిలాండ్తో జరిగిన రెండు వన్డేల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో కివీస్ బ్యాటర్ డెరిల్ మిచెల్ అద్భుత సెంచరీతో చెలరేగగా, భారత బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా జడేజా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడి వన్డే కెరీర్పై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మాదిరిగానే జడేజా కూడా ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నాడు. వయసు రీత్యా అతడి ప్రదర్శనలో ఏమాత్రం లోపం కనిపించినా సెలెక్టర్లు ఉపేక్షించే పరిస్థితి లేదు. మరో ఏడాదిలో 50 ఓవర్ల ప్రపంచ కప్ రాబోతున్న తరుణంలో, జడేజా ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
35
రెండు మ్యాచ్లలోనూ నిరాశే మిగిలింది
ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగగా, రెండింటిలోనూ జడేజా నిరాశపరిచాడు. వడోదరలో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బౌలింగ్లోనూ 9 ఓవర్లు వేసి 56 పరుగులు సమర్పించుకున్నా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇక రాజ్కోట్ మ్యాచ్ విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బ్యాటింగ్లో 44 బంతులు ఎదుర్కొన్న జడేజా, ఏ దశలోనూ సౌకర్యంగా కనిపించలేదు. కేవలం 27 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బౌలింగ్లో 8 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చినా వికెట్ల ఖాతా తెరవలేకపోయాడు. బంతి, బ్యాట్ రెండింటితోనూ మ్యాజిక్ చేయడంలో విఫలమయ్యాడు.
జడేజా పేలవ ఫామ్ నేపథ్యంలో సెలెక్టర్లు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆల్ రౌండర్లు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వడం వల్లే ఈ సిరీస్లో జడేజాకు అవకాశం దక్కింది. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో జడేజా విఫలమయ్యాడు.
2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో జడేజా ఉండాలంటే, ఇండోర్లో జరిగే మూడో వన్డేలో కచ్చితంగా తన సత్తా చాటాల్సిందే. లేదంటే అతడి స్థానంలో అక్షర్ పటేల్ను శాశ్వతంగా ఎంపిక చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
55
జడేజా గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న రవీంద్ర జడేజా, 2009లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున 209 వన్డే మ్యాచ్లు ఆడాడు. తన కెరీర్లో 32.50 సగటుతో 2893 పరుగులు సాధించాడు. అదే సమయంలో తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో 232 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ లేమి అతడి కెరీర్కు ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం నాటి మ్యాచ్తో జడేజా తన విమర్శలకు చెక్ పెడతాడా లేక జట్టులో చోటు కోల్పోతాడా అనేది వేచి చూడాలి.