Lionel Messi to visit India: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబరులో భారత్ కు వస్తున్నారు. ఈ పర్యటనలో నాలుగు నగరాలు సందర్శించనున్నారు. అలాగే, ప్రధాని మోడీతో కూడా భేటీ కానున్నారు.
అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ డిసెంబరులో భారత్కి రానున్నారు. డిసెంబర్ 12 నుండి 15 వరకు ఈ పర్యటన జరగనుంది. ఈ టూర్ లో ఆయన కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు. మెస్సీ పర్యటనకు ఆయన తండ్రి, ఏజెంట్ జార్జే మెస్సీ, బృందం అనుమతి ఇచ్చినట్లు కోల్కతా వ్యాపారవేత్త సతాద్రు దత్త తెలిపినట్టు పీటీఐ నివేదికలు పేర్కొన్నాయి.
DID YOU KNOW ?
లియోనెల్ మెస్సీ రికార్డులు
అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ మెస్సీ చేశాడు. 182 మ్యాచ్లలో 106 గోల్స్ (2025 వరకు). 2022 ఫిఫా వరల్డ్కప్ విజేత – గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నారు.
25
నాలుగు నగరాల్లో మెస్సీ పర్యటన షెడ్యూల్
డిసెంబర్ 12న కోల్కతాలో లియోనెల్ మెస్సీ పర్యటన ప్రారంభమవుతుంది. 13న అహ్మదాబాద్, 14న ముంబై, 15న ఢిల్లీలో మెస్సీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కూడా ఈ పర్యటనలో భాగమని సతాద్రు దత్త పేర్కొన్నారు. ఈ పర్యటన GOAT Tour of India పేరుతో జరగనుందని సమాచారం.
35
భారత పర్యటనపై మెస్సీ ప్రకటన
ఈ పర్యటన వివరాలను లియోనెల్ మెస్సీ స్వయంగా ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 1 మధ్య తన సోషల్ మీడియా వేదికల్లో ప్రకటించనున్నారు. ఒక వీడియో ద్వారా ఆయన భారత్ పర్యటనను అధికారికంగా తెలియజేస్తారు. ఇంటర్ మయామీ ఆటగాళ్లలో రోడ్రిగో డి పౌల్, లూయిస్ సువారెజ్, జోర్డి ఆల్బా, సెర్జియో బుస్కెట్స్ కూడా రావచ్చని భావిస్తున్నా, ఇంకా ఇది ఖరారు కాలేదని దత్త చెప్పారు.
లియోనెల్ మెస్సీ చివరిసారి 2011 సెప్టెంబర్లో భారత్కు వచ్చారు. ఆ సమయంలో కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో వెనిజులా జట్టుతో స్నేహపూర్వక మ్యాచ్లో ఆడారు. అది అర్జెంటీనా కెప్టెన్గా మెస్సీ తొలి మ్యాచ్ కావడం విశేషం. అంతకుముందు పెలే, మరడోనా, రొనాల్డీన్యో, ఎమిలియానో మార్టినెజ్ వంటి ఫుట్బాల్ దిగ్గజాలను కోల్కతాకు తీసుకురావడంలో కూడా సతాద్రు దత్త పాత్ర ఉంది.
55
కేరళ పర్యటన వివాదం మధ్య ఈ ప్రకటన
ఈ ప్రకటన కేరళలో అర్జెంటీనా జట్టు పర్యటనపై వివాదం కొనసాగుతున్న సమయంలో వచ్చింది. కేరళ క్రీడా మంత్రి వి. అబ్దుర్ రహ్మాన్ గతంలో అక్టోబరులో అర్జెంటీనా జట్టు స్నేహపూర్వక మ్యాచ్ కోసం వస్తుందని చెప్పారు. కానీ స్పాన్సర్, అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ మధ్య ఒప్పంద సమస్యల కారణంగా ఆ పర్యటన రద్దయింది.
మంత్రి ప్రకారం డిసెంబరులో మెస్సీ వ్యక్తిగత పర్యటన మాత్రమే జరగనుంది. స్పాన్సర్లు మాత్రం అర్జెంటీనా జట్టు కేరళలో ఆడకపోతే భారత్లో ఎక్కడా ఆడకూడదని హెచ్చరించారు. ఈ నేపథ్యంతో మెస్సీ పర్యటనకు సంబంధించిన అధికారిక నిర్ధారణ ప్రాధాన్యం సంతరించుకుంది.