సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత సీజన్లో జట్టు ఆశించిన ప్రదర్శన చేయకపోవడంతో, నిరాశపరిచిన ఎనిమిది మంది ఆటగాళ్లను విడుదల చేసి, కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఈ మినీ వేలంలో సమర్థవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆరెంజ్ ఆర్మీ కసరత్తులు చేస్తోంది.
25
భారీ పర్స్ మనీతో వేలంలోకి..
ఎనిమిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా సన్రైజర్స్ హైదరాబాద్కు రూ. 25.50 కోట్ల పర్స్ మనీ సమకూరింది. ఇతర జట్లతో పోలిస్తే, ఎస్ఆర్హెచ్ వద్ద వేలంలో ఖర్చు చేసేందుకు మంచి అమౌంట్ ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధానంగా మూడు కీలక విభాగాల్లో జట్టును బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. పవర్ హిట్టర్తో లోయర్ ఆర్డర్ను బలోపేతం చేయడం, ఒక ఇండియన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ను చేర్చుకోవడం, అలాగే మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో భారత పేసర్ను జట్టులోకి తీసుకోవడం లాంటివి లిస్టులో ఉన్నాయి.
35
రస్సెల్ లేదా గ్రీన్..
ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఎస్ఆర్హెచ్ ప్రధానంగా నలుగురు ఆటగాళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొదటిగా, వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్. కావ్య మారన్ రస్సెల్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించవచ్చని సమాచారం. రస్సెల్ను తీసుకోవడం వల్ల జట్టుకు పవర్ హిట్టర్ వచ్చినట్టే. రస్సెల్కు బ్యాకప్గా కామెరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్, లివింగ్స్టోన్ల వైపు కూడా ఆరెంజ్ ఆర్మీ చూడవచ్చు. ప్రధానంగా కామెరూన్ గ్రీన్తో పాటు రస్సెల్పై కావ్య మారన్ దృష్టి సారించే అవకాశం ఉంది.
రెండవది, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఎస్ఆర్హెచ్ అన్వేషిస్తోంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్పై సన్రైజర్స్ కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసిన ఈ యువ భారత లెగ్ స్పిన్నర్కు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే అద్భుతమైన సామర్థ్యం ఉంది. రవి బిష్ణోయ్ దక్కకపోతే, మరో భారత అనామక స్పిన్నర్ను తీసుకునే అవకాశం కూడా ఉంది.
55
ఆకాష్ దీప్ లేదా మధ్వాల్..!
మూడవది, మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలో భారత పేసర్పై దృష్టి పెట్టింది. టీమిండియా స్టార్ పేసర్ ఆకాష్ దీప్తో పాటు, గతంలో ముంబై ఇండియన్స్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన ఆకాష్ మధ్వాల్ను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఓవర్సీస్ స్లాట్లు కేవలం రెండు మాత్రమే ఖాళీగా ఉండటంతో, సన్రైజర్స్ జట్టు భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఈ వ్యూహంతో ఐపీఎల్ 2026లో బలమైన జట్టును నిర్మించుకోవాలని సన్రైజర్స్ హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది.