CSK: చెన్నై సూపర్ కింగ్స్లో ఎంఎస్ ధోనీ ప్రభావం అపారం. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నా, ధోనీదే పూర్తి పెత్తనం అనే చర్చ నడుస్తోంది. మహమ్మద్ కైఫ్ వంటి మాజీ క్రికెటర్లు కూడా దీనిని సమర్థిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీకి గట్టి అనుబంధం ఉంది. సీఎస్కేపై రెండేళ్ల నిషేధం విధించిన కాలం మినహా, ప్రతి ఐపీఎల్ సీజన్లోనూ ధోనీ ఈ జట్టుతోనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా సీఎస్కేకు సేవలు అందిస్తూనే ఉన్నాడు. 2008 నుంచి చెన్నైతో ధోనీ బంధం కొనసాగుతోంది. మహి అంటే సూపర్ కింగ్స్, సూపర్ కింగ్స్ అంటే ధోనీ అనేంతలా వారిద్దరి అనుబంధం బలపడింది.
25
ధోనీ గ్రౌండ్లో కనిపిస్తే చాలు
వయసు పెరుగుతున్నా ధోనీ గ్రౌండ్లో కనిపిస్తే చాలు అని కోరుకునే అభిమానులు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. ధోనీ శరీరం సహకరించినంత వరకు ఐపీఎల్లో ఆడాలనే ఆలోచనలో ఉన్నాడు. 2026లో కూడా మహి బరిలోకి దిగుతాడని బలమైన నమ్మకం ఉంది. అయితే, ప్రస్తుతానికి రుతురాజ్ గైక్వాడ్ అధికారికంగా కెప్టెన్గా ఉన్నప్పటికీ, జట్టు పెత్తనమంతా ధోనీదే ఉంటుందని విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ, ధోనీ జట్టులో ఉన్నంత కాలం రుతురాజ్ గైక్వాడ్ కేవలం "పేపర్పై కెప్టెన్" మాత్రమేనని అన్నారు.
35
ధోనీదే పూర్తి ఆధిపత్యం
కెప్టెన్సీ బాధ్యతలు అధికారికంగా లేకపోయినప్పటికీ, ధోనీదే పూర్తి ఆధిపత్యం ఉంటుందని, చెన్నై సూపర్ కింగ్స్లో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని, జట్టును "షాడో కెప్టెన్"గా నడిపిస్తాడని కైఫ్ అభిప్రాయపడ్డారు. గత సీజన్లో వికెట్ కీపర్గా ధోనీ అద్భుతమైన ప్రదర్శన కనబర్చినప్పటికీ, బ్యాటర్గా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన రావడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. వచ్చే సీజన్లో ధోనీ పాత్ర ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.
ఈ పరిణామాల మధ్యే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ సీఎస్కే జట్టులోకి వచ్చాడు. శాంసన్కు బదులుగా రవీంద్ర జడేజా, సామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్కు మారారు. సంజూ శాంసన్ను టాప్ ఆర్డర్లో స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడించే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్గా ధోనీనే కొనసాగుతాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే శాంసన్ను జట్టులోకి తీసుకున్నారని, ఒకవేళ ధోనీ ఐపీఎల్కు వీడ్కోలు పలికితే, సంజూ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంటున్నారు. శాంసన్కు కూడా గణనీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
55
సంజూ శాంసన్ వచ్చినా..
అయితే, జట్టులోకి కొత్తగా సంజూ శాంసన్ వచ్చినా, కెప్టెన్ మాత్రం రుతురాజ్ గైక్వాడే అని ఇప్పటికే స్పష్టమైంది. దీంతో యువ వికెట్ కీపర్ కేవలం బ్యాటర్ రోల్కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్లో ధోనీ ఎంతకాలం కొనసాగుతాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కెప్టెన్గా ధోనీకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు సార్లు టైటిల్ అందించాడు. రోహిత్ శర్మ తర్వాత అత్యధిక టైటిల్స్ సాధించిన కెప్టెన్గా ధోనీ కొనసాగుతున్నాడు.