IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్పై పంజాబ్ కింగ్స్ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, క్రమశిక్షణా చర్యలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.
25
మొదటి తప్పుగా పరిగణించి..
పంజాబ్ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో స్లో ఓవర్ రేట్ నేరం. గతంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. అప్పుడు మొదటి తప్పుగా పరిగణించి కేవలం కెప్టెన్కు మాత్రమే జరిమానా విధించారు.
35
రెండోసారి తప్పు చేయడంతో భారీ మూల్యం
కానీ, ఇది రెండోసారి కావడంతో శిక్ష తీవ్రత పెరిగింది. నిబంధనల ప్రకారం శ్రేయస్ అయ్యర్కు 24 లక్షల రూపాయల జరిమానా విధించగా, జట్టులోని మిగిలిన 10 మంది ఆటగాళ్లకు కూడా ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా పడింది.
ప్రస్తుతం లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్కు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. పంజాబ్ వంటి కీలక జట్లకు కెప్టెన్ అందుబాటులో లేకపోవడం పెద్ద దెబ్బ అవుతుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ సిఎస్కేపై 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చిన తరుణంలో, ఇటువంటి సస్పెన్షన్లు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
55
విజయాలు సాధించినా..
మున్ముందు మ్యాచ్లలో పంజాబ్ జట్టు ఫీల్డింగ్ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో విజయాలు సాధించినా, టెక్నికల్ కారణాల వల్ల కెప్టెన్ దూరం కావడం ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయవచ్చు.