RCB vs CSK : ఐపీఎల్ 2026లో బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై 207 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సిక్సర్ల మోత మోగించారు.
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 11వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది.
26
తొలుత బెంగళూరు బ్యాటింగ్ విధ్వంసం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం రజత్ పాటిదార్ సారథ్యంలో బెంగళూరు బ్యాటర్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్, రజత్ పాటిదార్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
36
చెన్నైకి ఆదిలోనే షాక్
భారీ లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 7 పరుగులకే జేకబ్ డఫీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఆయుష్ మాత్రే (1) కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వెనుదిరిగాడు. సంజూ శాంసన్ ఒక సిక్సర్తో ఆశలు రేపినప్పటికీ, 9 పరుగుల వద్ద డఫీ బౌలింగ్లో దేవ్ దత్ పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది.
ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన కౌంటర్ ఎటాక్ చేశాడు. కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సర్ఫరాజ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరును 77 పరుగులకు చేర్చాడు. అయితే పాండ్యా తన మొదటి బంతికే సర్ఫరాజ్ ఖాన్ను అవుట్ చేసి చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు.
56
కుప్పకూలిన చెన్నై మిడిలార్డర్
సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిన తర్వాత శివం దూబే (18), ప్రశాంత్ వీర్ (43) జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించినా, అభినందన్ సింగ్ బౌలింగ్లో జితేష్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో దూబే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జేమీ ఓవర్టన్ 16 బంతుల్లో 37 పరుగులు చేసి వేగంగా ఆడినప్పటికీ, సుయాష్ శర్మ బౌలింగ్లో వెనుదిరిగాడు. కార్తీక్ శర్మ (6) కూడా పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
66
సర్ఫరాజ్ మెరుపులు వృధా.. సీఎస్కే చిత్తు
చివరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్ చెన్నై లోయర్ ఆర్డర్ను దెబ్బకొట్టారు. భువనేశ్వర్ తన కోటా 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. చివరగా మాట్ హెన్రీ (2)ని అభినందన్ సింగ్ అవుట్ చేయడంతో చెన్నై ఇన్నింగ్స్ 207 పరుగుల వద్ద ముగిసింది. బెంగళూరు తరఫున జేకబ్ డఫీ, పాండ్యా రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో ముందుకెళ్లింది.