India vs West Indies : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య చావో రేవో తేల్చుకునే పోరు కోల్కతాలో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది. అయితే, గత రికార్డులు భారత్ ను భయపెడుతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ vs వెస్టిండీస్.. గెలిస్తే సెమీస్, ఓడితే ఇంటికే
ఆదివారం (మార్చి 1) క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం పంచేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కోల్కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఇది ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటికి చేరుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా వెస్టిండీస్ సెమీస్ చేరుతుంది. ఇది టీమ్ ఇండియాకు భారీ సవాల్గా మారింది.
26
భారత్ను వణికిస్తున్న గత చరిత్ర
కోల్కతాలో అడుగుపెట్టే ముందు టీమ్ ఇండియాను చరిత్ర భయపెడుతోంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వెస్టిండీస్తో తలపడినప్పుడల్లా భారత్కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ మూడు సార్లు విజయం సాధించగా, భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో విండీస్ జట్టు భారత్పై పైచేయి సాధిస్తూ వస్తోంది.
36
IND vs WI : వరల్డ్ కప్ హెడ్ టు హెడ్ రికార్డులు
భారత్, వెస్టిండీస్ జట్లు టీ20 వరల్డ్ కప్లో మొదటిసారి 2009లో తలపడ్డాయి. ఆ సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం 2010లో మళ్ళీ సూపర్ 8 దశలోనే విండీస్ 14 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2014లో మాత్రం భారత్ పుంజుకుని 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే, 2016 సెమీఫైనల్లో ధోనీ సారథ్యంలోని భారత జట్టును ముంబైలో 7 వికెట్ల తేడాతో ఓడించి వెస్టిండీస్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది.
ప్రపంచ కప్ రికార్డులు భయపెడుతున్నప్పటికీ, ఓవరాల్ టీ20 గణాంకాల్లో భారత్ బలంగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 19 మ్యాచ్ల్లో విజయం సాధించగా, వెస్టిండీస్ 10 మ్యాచ్ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. అయితే, 2023లో భారత జట్టును టీ20 సిరీస్లో ఓడించిన చివరి జట్టు వెస్టిండీస్ కావడం గమనార్హం. ఇది విండీస్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
56
ప్రస్తుత వరల్డ్ కప్లో సవాల్గా టీమ్ ఇండియా ప్రయాణం
ఈ టోర్నీలో భారత్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగింది. గ్రూప్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ను ఓడించి భారత్ సూపర్ 8 కు దూసుకొచ్చింది. అయితే, సూపర్ 8 మొదటి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై ఘన విజయం సాధించి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు సెమీస్ చేరాలంటే విండీస్ను కచ్చితంగా ఓడించాల్సి ఉంది.
66
వెస్టిండీస్ ఫామ్ ఎలా ఉంది?
మరోవైపు వెస్టిండీస్ కూడా అత్యంత బలంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ జట్లపై విండీస్ ఘనవిజయాలు సాధించింది. సూపర్ 8లో జింబాబ్వేను చిత్తు చేసిన ఈ జట్టు, సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఓటమిని చవిచూసింది. ప్రస్తుతం మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. భారీ హిట్టర్లు ఉన్న విండీస్ను ఈడెన్ గార్డెన్స్ వంటి చిన్న స్టేడియంలో అడ్డుకోవడం భారత బౌలర్లకు పెద్ద పరీక్ష కానుంది.